రైతుల నోళ్లు కొట్టి ...బలవంతపు భూసేకరణకు పాల్పడుతున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు.
విజయవాడ : రైతుల నోళ్లు కొట్టి ...బలవంతపు భూసేకరణకు పాల్పడుతున్న ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తోందని ఆ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. రాజధాని రైతులకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విజయవాడలోని సీఆర్డీఏ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ భూ సేకరణను ప్రభుత్వం తక్షణమే నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు.
మూడు పంటలు పండే భూములను ల్యాండ్ పూలింగ్ ద్వారా 33వేల ఎకరాలు తీసుకున్న ప్రభుత్వం...తాజాగా బలవంతపు భూ సేకరణ చేపట్టిందని ఉమ్మారెడ్డి ధ్వజమెత్తారు. రైతులతో పాటు, కౌలు రైతులు కూడా తీవ్రంగా నష్టపోతున్నారని ఆయన అన్నారు. ఎన్డీయే ప్రభుత్వం భూ సేకరణ ఆర్డినెన్స్ తీసుకు వచ్చిందని, అయితే ఆ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందకపోయినా...రాష్ట్ర ప్రభుత్వం మాత్రం 166 జీవో తీసుకు వచ్చి భూముల సేకరిస్తోందని ఉమ్మారెడ్డి వ్యాఖ్యానించారు. అంతేకాకుండా గ్రామకంఠాల పేరుతో దానికొక నోటిఫికేషన్ ఇచ్చి రైతుల వద్ద నుంచి భూములు లాక్కోవడం అన్యాయమన్నారు. ఈ చర్యలను ప్రతిపక్ష పార్టీ వ్యతిరేకిస్తోందన్నారు.