ప్రభుత్వం పదేపదే చెప్పే స్మార్ట్ మాట ఇప్పుడు పోలీసు శాఖ బాట పట్టింది.
విజయవాడ సిటీ : ప్రభుత్వం పదేపదే చెప్పే స్మార్ట్ మాట ఇప్పుడు పోలీసు శాఖ బాట పట్టింది. అన్ని విభాగాల్లో స్మార్ట్ విధానం అమలవుతున్న తరుణంలో కమిషనరేట్ పరిధిలో కూడా అమలులోకి తెచ్చేందుకు ఉన్నతాధికారులు నిర్ణయించారు. కమిషనరేట్ పరిధిలో తిరిగే ఆటో డ్రైవర్లకు స్మార్ట్ కార్డులు ఇవ్వాలనేది పోలీసు అధికారుల ఆలోచన. నవ్యాంధ్ర రాజధానిలో ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరిచే క్రమంలో ఈ నిర్ణయం తీసుకోనున్నట్టు తెలిసింది. మరో పక్షం రోజుల్లో స్మార్ట్ కార్డుల విధానం అమల్లోకి తెచ్చేందుకు పోలీసు అధికారులు ప్రయత్నిస్తుండగా.. ఆటో యూనియన్ల నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. స్మార్ట్ కార్డులు ఇస్తే నిరుద్యోగ యువత జీవనోపాధికి గండికొట్టడమేనంటూ వారు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయం మంగళవారం నగర పోలీస్ కమిషనరేట్లో జరిగిన ఆటో యూనియన్ సంయుక్త కార్యాచరణ సమావేశంలో చర్చకు రాగా యూనియన్ నేతలు వ్యతిరేకించారు. పోలీసు అధికారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుచేస్తామని స్పష్టం చేసినట్టు తెలిసింది.
పది వేల ఆటోలు..
నగర పరిధిలో సుమారు 10 వేల ఆటోలున్నాయి. యజమానులతోపాటు ఇదే సంఖ్యలో డ్రైవర్లు ఆటోరంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఆర్సీ పుస్తకం, డ్రైవింగ్ లెసైన్స్సహా అన్ని రికార్డులు సక్రమంగా ఉన్నవారికి స్మార్ట్ కార్డులు మంజూరు చేస్తారు. తనిఖీల సమయంలో ప్రయాణికులతోపాటు ఆటో డ్రైవర్లను కూడా తనిఖీ చేయడం రివాజు. ఆ సమయంలో డ్రైవర్లు స్మార్ట్ కార్డు చూపించినట్టయితే వెంటనే పంపుతారు. ప్రయోగాత్మకంగా పండిట్ నెహ్రూ బస్స్టేషన్, రైల్వేస్టేషన్లోని ప్రీపెయిడ్ స్టాండ్లలో ఆటోలు నడిపే డ్రైవర్లకు వీటిని పంపిణీ చేస్తారు. దశలవారీగా నగరంలోని అన్ని ప్రాంతాల డ్రైవర్లకు స్మార్ట్ కార్డులు ఇవ్వాలని పోలీసు అధికారులు భావిస్తున్నారు.
స్మార్ట్ సిటీలో భాగమే..
ప్రజా రవాణా భద్రతపై ప్రజల్లో నెలకొన్న సందేహాల నివృత్తి కోసమే స్మార్ట్ కార్డులిస్తున్నామన్నది పోలీసు అధికారులు వాదన. రాజధాని నగరానికి పొరుగు ప్రాంతాలకు చెందిన పౌరుల రాకపోకలు పెరుగుతాయి. వీరు ఆటోలు, టాక్సీలను ఆశ్రయిస్తుంటారు. వివిధ పనుల నిమిత్తం వచ్చే వారు సురక్షితంగా తమ పనులు పూర్తిచేసుకుని వెళ్లేందుకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పోలీసులు చెబుతున్నారు. ఆటో డ్రైవర్ల ముసుగులో అసాంఘికశక్తులు చేసే పనులకు రాజధాని ప్రతిష్ట దిగజారరాదనేది పోలీసు అభిప్రాయం. ఇందులో భాగంగానే స్మార్ట్ కార్డులు ప్రవేశపెడుతున్నారు. స్మార్ట్ కార్డుల జారీకి ముందే నిబంధనల ప్రకారం రికార్డుల పరిశీలన, ఇతర అంశాలను విచారించి మంజూరు చేస్తారు. తద్వారా ఆయా డ్రైవర్ల ప్రవర్తన, నిబంధనల అమలు సక్రమంగా ఉన్నట్టు స్మార్ట్ కార్డుల మంజూరు ద్వారా పోలీసులు ధృవీకరిస్తారు. ప్రయాణికులను ఎక్కించుకొని వెళ్లే సమయంలో వీటిని సంబంధిత ప్రాంతాల్లో స్వైప్ చేయాల్సి ఉంటుంది. ఎక్కడైనా ఆపిన పక్షంలో స్మార్ట్ కార్డు చూపించి వెళ్లేలా చర్యలు తీసుకుంటారు.
యూనియన్ల పెదవివిరుపు
ఆటో డ్రైవర్లకు స్మార్ట్ కార్డుల విధానంపై యూనియన్ నేతలు పెదవి విరుస్తున్నారు. విద్యావంతులైన యువకులు ఉపాధి కోసం ఆటో రంగంపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్నట్టు చెబుతున్నారు. అనేకమంది ఆటో డ్రైవర్లకు లెసైన్స్లు ఉన్నా బ్యాడ్జి లేదని, కొందరికి లెసైన్స్ లేదని చెబుతున్నారు. ఇప్పటికప్పుడు ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని ధ్రువీకరణ పత్రాలు తీసుకోవడం సాధ్యపడదని, ప్రభుత్వ నిబంధనలు కూడా అన్ని పత్రాలు తీసుకునేందుకు ఆటంకంగా ఉన్నాయంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్మార్ట్ కార్డు విధానాన్ని అమల్లోకి తేవడమంటే నిరుద్యోగుల ఉపాధికి గండికొట్టడమేనని భావిస్తున్నారు. పోలీసు అధికారుల చర్యలు ఆటో రంగంపై ఆధారపడి జీవించే వేలాది మంది జీవనోపాధి కోల్పోతారని ఐఎఫ్టీయూ అనుబంధ ప్రగతిశీల ఆటో సంఘం నేత ఎల్.వి.కుటుంబరావు చెప్పారు.