
టెన్త్ టెన్షన్
జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 35 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు.
పదో తరగతి పబ్లిక్ పరీక్షలు-2015కు హాజరయ్యే విద్యార్థుల్లో, వారికి బోధించాల్సిన ఉపాధ్యాయుల్లో సిలబస్ టెన్షన్ మొదలైంది. కొత్త సిలబస్, పాత పరీక్షా విధానమే ఇందుకు ప్రధాన కారణం. ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తీర్ణత శాతం పెంచాలని అధికారుల ఆదేశాలు ఉపాధ్యాయుల్లో ఒత్తిడిని పెంచుతోంది. పరీక్షా విధానం పాతదైనప్పటికీ సిలబస్ కొత్తది కావడంతో అటు విద్యార్థుల్లో, అటు ఉపాధ్యాయుల్లో గందరగోళం నెలకొంది. మార్చిలో జరిగే పబ్లిక్ పరీక్షలకు జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కసరత్తును ప్రారంభించింది. 40 రోజుల స్పెషల్ క్లాస్ను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
నెల్లూరు(విద్య) :జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో సుమారు 35 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి సమగ్ర, నిరంతర మూల్యాంకన పద్ధతిలో పాఠ్యపుస్తకాలను రూపొందించారు. పరీక్షలు మాత్రం పాతపద్ధతిలోనే నిర్వహించాలని నిర్ణయించారు. పాఠ్యాంశాలు పాతవైతే విద్యార్థులు పరీక్షల్లో ప్రశ్నలకు పేజీలు పేజీలు జవాబులు రాసేవారు. కొత్త పాఠ్యపుస్తకాల ప్రకారం పరీక్షల్లో సంక్షిప్త రూపంలో జవాబులు రాయాల్సి ఉంటుంది.
ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో కొత్త పాఠ్యపుస్తకాల ఆధారంగా వచ్చే ప్రశ్నలకు పాతపద్ధతిలో జవాబులు రాయాల్సి రావడం విద్యార్థులకు ఇబ్బందికరంగా ఉంటుందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు మారిన పాఠ్యపుస్తకాలపై ఉపాధ్యాయులకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇవ్వకపోవడంతో పాఠ్యాంశాల బోధన అంతంతమాత్రంగానే సాగుతోంది. ఫిబ్రవరి రెండో వారానికి సిలబస్ అంతా పూర్తిచేయాలని విద్యాశాఖ అధికారులు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
కొత్త సిలబస్కు పాతపద్ధతిలో నమూనా ప్రశ్నాపత్రాలను తయారుచేయడం ఉపాధ్యాయులకు తలకు మించిన భారమైంది. పాతపరీక్షా విధానంలో పరీక్షలు పెట్టేందుకు నమూనాపత్రాలను రాష్ట్ర విద్యాశాఖ నవంబర్ ఆఖరు వారంలో విడుదల చేశారు. డిసెంబర్లో సమ్మెటివ్-2లో ఆ నమూనా ప్రశ్నాపత్రాల ఆధారంగా ఉపాధ్యాయులు పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షల్లో వచ్చిన ఫలితాలు మిశ్రమంగా ఉండడంతో ఉపాధ్యాయుల్లో ఆందోళన నెలకొంది.
ఆశించిన స్థాయిలో విద్యార్థులు పరీక్షల్లో నిరంతర సమగ్ర మూల్యాంకన పద్ధతికి అలవాటు పడలేరనే విషయం స్పష్టమైంది. దీంతో ఉపాధ్యాయులు ఉన్న ఈ కొద్దికాలాన్ని ఎలా సద్వినియోగంచేసుకోవాలో అనే ఆలోచనలో పడ్డారు. మరో రెండు నెలల్లో జరిగే 10వ తరగతి పరీక్షలకు డిసెంబర్ నెలాఖరులోగా సిలబస్ పూర్తిచేసి రివిజన్ ప్రారంభించాల్సి ఉందని విద్యావిశ్లేషకుల అభిప్రాయం. అలాగే కొత్త సిలబస్, పాతపద్ధతి అటు అందరినీ అయోమయంలో పడేసింది.
చెప్పేవారేరి?:
ప్రభుత్వ, జిల్లా పరిషత్ హైస్కూళ్లలో మ్యాథ్స్-55, ఫిజికల్ సైన్స్-36, బయలాజికల్ సైన్స్- 62, సోషల్ స్టడీస్- 114, తెలుగు- 44, హిందీ- 48, ఇంగ్లిష్- 25 పోస్టులు ఖాళీగా ఉన్నాయని ఉపాధ్యాయుల అంచనా. తాజాగా జనవరి రెండో తేదీన 64 మంది ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించాయి. మరో రెండు నెలల్లో పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ 64 మంది స్కూల్ అసిస్టెంట్లు పదో తరగతి విద్యార్థులకు ఏ విధంగా బోధిస్తారనేది ప్రశ్నార్థకంగా మారింది. వీరిలో మ్యాథ్స్- 18, పీఎస్-28, బయాలజీ-35, ఇంగ్లిష్-11 మంది ఉన్నారు. సోషల్, తెలుగు, హిందీ సబ్జెక్టులకు పదోన్నతులు లేవు.
మారిన సిలబస్ పాఠాలు చెప్పడం అనుభవమున్న ఉపాధ్యాయులకే కష్టతరంగా మారింది. ఉపాధ్యాయులు పాఠాలు చెప్పేందుకు ప్రిపేర్ కావడానికే ఎక్కువ సమయం పడుతోంది. మొదటి బ్యాచ్ కావడంతో గైడ్లు, మెటీరియల్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి లేకపోవడంతో అటు ఉపాధ్యాయులు, ఇటు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు.
దీర్ఘకాలికంగా ఒకే సిలబస్ను బోధించిన సీనియర్ ఉపాధ్యాయులు, కొత్తగా ఉద్యోగాల్లో చేరిన ఉపాధ్యాయులు పాఠాలు బోధించేందుకు ఇబ్బందులు పడుతున్నారనేది జిల్లా విద్యాశాఖ బాహాటంగా ఒప్పుకుంటున్న సత్యం. ఈ నేపథ్యంలో ప్రత్యేక తరగతులు, మెటీరియల్స్ త్వరగా విద్యార్థులకు అందజేసి 40 రోజుల ప్రత్యేక శిక్షణ కార్యక్రమాన్నైనా ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉందని విద్యావేత్తల అభిప్రాయం.