‘రాజన్న పాలన జగనన్నతోనే సాధ్యం’ | Sakshi
Sakshi News home page

‘రాజన్న పాలన జగనన్నతోనే సాధ్యం’

Published Sat, Jul 8 2017 4:41 PM

‘రాజన్న పాలన జగనన్నతోనే సాధ్యం’ - Sakshi

గుంటూరు: దివంగత మహానేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి పరిపాలన ఒక సువర్ణయుగమని వైఎఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. రాష్ట్ర ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆయన కోరుకున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కాకముందు ప్రజా ప్రస్థానం పాదయాత్ర ద్వారా ప్రజల కష్టాలు దగ్గర నుంచి చూసి ఏకైక వ్యక్తి వైఎస్‌ఆర్‌ అని కొనియాడారు. ఎ్రరటి మండుటెండల్లో చేవెళ్ల నుంచి శ్రీకాకుళం వరకు పాదయాత్ర చేపట్టారని... గుడిసెల్లో నివసించే పేద ప్రజలకు పక్కా ఇళ్లు కట్టించి, గుడిసెలేని గ్రామం ఉండాలని కృషి చేసిన వ్యక్తి వైఎస్‌ఆర్‌ అని తెలిపారు. చంద్రబాబు పరిపాలనలో ఇలాంటి కార్యక్రమాలు ఒక్కటైనా జరిగాయా అని ప్రజలను అడిగారు. రాజన్న పరిపాలన రావాలంటే వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావాలన్నారు. వైఎస్‌ఆర్‌ సీపీ జాతీయ ప్లీనరీలో ప్రవేశపెట్టిన ప్రజాసంక్షేమ తీర్మానాన్ని బాలరాజు బలపరిచారు.

వైఎస్‌ఆర్‌ చిరస్మరణీయుడు
అమరావతి: దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి చిరస్మరణీయుడని వైఎస్‌ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి జంగా కృష్ణమూర్తి కొనియాడారు. ప్లీనరీలో ఆయన బీసీ సంక్షేమంపై తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. దివంగత ముఖ్యమంత్రి వైయస్‌ రాజశేఖర్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా భావించారని అన్నారు. అన్ని వర్గాలకు సమ న్యాయం చేసిన మహానుభావుడు వైఎస్‌ఆర్‌ అని ప్రశంసించారు. విద్యా, వైద్యం మైనార్టీ, బడుగు, బలహీన వర్గాలకు అందేలా చూశారని చెప్పారు. పేదలకు విద్యాదాత వైఎస్‌ఆర్‌ అన్నారు. మహానేత ఆశయ బాటలో నడుస్తున్న వైఎస్‌ జగన్‌ నాయకత్వంలో పార్టీని బలోపేతం చేద్దామని, జగన్‌ సీఎం అయితేనే రాజన్న రాజ్యం వస్తుందన్నారు. బీసీలకు టీడీపీ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని విమర్శించారు. వైఎస్‌ఆర్‌ హయాంలో బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేశారని తెలిపారు. సంక్షేమ కార్యక్రమాలు తూచా తప్పకుండా అమలు కావాలంటే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాల్సిందేనని అభిప్రాయపడ్డారు.

సంబంధిత కథనాలు:

ఏపీని బజారున పడేసింది టీడీపీనే: నాగిరెడ్డి

భగవంతుడు పంపిన దూత వైఎస్‌ జగన్‌: రెడ్డి శాంతి

వైఎస్‌ జగన్‌ సీఎం అయితేనే పోలవరం పూర్తి

Advertisement
Advertisement