
టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది..
నగర కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. కార్పొరేషన్లోని 48 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి.
కాకినాడ: నగర కార్పొరేషన్ ఎన్నికలలో టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు కుదిరింది. కార్పొరేషన్లోని 48 వార్డుల్లో జరగనున్న ఎన్నికలలో టీడీపీ 39, బీజేపీ 9 చోట్ల నుంచి పోటీ చేయనున్నాయి. కాగా కనీసం 20 టిక్కెట్లు కావాలని బీజేపీ పట్టుబట్టినప్పటికీ మూడు సీట్లకు మించి ఇవ్వలేమంటూ టీడీపీ తేల్చి చెప్పింది. దీంతో మంత్రులు రంగంలోకి దిగి ఇరుపార్టీల మధ్య నెలకొన్న వివాదానికి తెర దించారు. ఎట్టకేలకు బీజేపీకి తొమ్మిది సీట్లు కేటాయించింది.
అలాగే ఈ నెల 29న జరిగే కాకినాడ కార్పొరేషన్ ఎన్నికలకు టీడీపీ, బీజేపీ కలిసి ప్రచారం చేయాలని నిర్ణయించాయి. ఏడేళ్ల తర్వాత నగర కార్పొరేషన్ ఎన్నికలు జరుగుతున్నాయి. కాగా డివిజన్ల పునర్విభజన నేపథ్యంలో గతంలో పోటీ చేసిన ప్రాంతాలు తారుమారు కావడం, రిజర్వేషన్లు మారడం, అకస్మాత్తుగా ఎన్నికల కమిషన్ షెడ్యూల్ను ప్రకటించడంతో చాలా చోట్ల అభ్యర్థుల ఎంపిక రాజకీయ పార్టీలకు కొంత తలనొప్పిగా మారింది.