రాష్ట్రాన్ని రెండుగా చీలుస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి గురువారం రాత్రి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంపై ఆగ్రహం పెల్లుబుకుతోంది.
=నేడు వైఎస్సార్ సీపీ బంద్
=కాంగ్రెస్ నిర్ణయంపై రగులుతున్న అన్ని వర్గాల ప్రజలు
=విశాఖ సహా జిల్లా వ్యాప్తంగా కేంద్ర పోలీసు బలగాల మోహరింపు
=జిల్లా బంద్కు గంటా, టీడీపీ పిలుపు
విశాఖపట్నం - సాక్షి ప్రతినిధి: రాష్ట్రాన్ని రెండుగా చీలుస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయానికి గురువారం రాత్రి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేయడంపై ఆగ్రహం పెల్లుబుకుతోంది. జిల్లాలోని వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక సంఘాలు తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యోగ సంఘాలు మరో విడత మెరుపు సమ్మెకు సిద్ధమయ్యాయి. రాష్ట్ర విభజనను నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శుక్రవారం ఇచ్చిన రాష్ట్ర వ్యాప్త బంద్కు జిల్లాలోని పార్టీ శ్రేణులన్నీ సమాయత్తం అయ్యాయి.
రాష్ట్ర విభజనకు నిరసనగా వైఎస్సార్ సీపీ సమైక్యాంధ్ర నినాదంతో జనం మధ్యకు వచ్చిన విషయం తెలిసిందే. అన్ని వర్గాల ప్రజల నుంచి కూడా తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తం కావడంతో కేంద్రం కొంత వెనక్కు తగ్గినట్లు నటించింది. ఇదే సమయంలో రాబోయే ప్రమాదం గురించి హెచ్చరిస్తూ వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి సమైక్యాంధ్ర శంఖారావం పేరుతో ప్రజా చైతన్య యాత్రలకు శ్రీకారం చుట్టారు. పార్టీ శ్రేణులన్నీ ఊరు, వాడ నిరసనల ధ్వనులు వినిపించాయి. అన్ని వర్గాలు చేపట్టిన ఆందోళనకు బహిరంగ మద్దతు ప్రకటించాయి.
సీమాంధ్ర జనం భయపడుతూ వచ్చిన విధంగానే కేంద్ర కేబినెట్ గురువారం నాటి సమావేశంలో రాష్ట్రాన్ని రెండుగా చీలుస్తూ నిర్ణయం తీసుకోవడంతో జనం తీవ్రంగా మండిపడుతున్నారు. సాయంత్రం 4 గంటల నుంచే జిల్లాలో కూడా కేంద్ర పోలీసు బలగాలు రోడ్ల మీద పహారా కాయడం, ఆంధ్ర యూనివర్శిటీలో నిఘా ఉంచడం, ప్రజాప్రతినిధుల ఇళ్ల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం లాంటి పరిణామాలన్నీ రాష్ట్రం రెండుగా చీలబోతోందనే సంకేతాలకు బలం చేకూర్చాయి.
కేంద్ర నిర్ణయాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీపీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా బంద్ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టబోతోందనే సంకేతాలు అందినప్పటి నుంచి తాము రాజీనామాలు చేస్తామనీ, పార్లమెంటులోను, శాసనసభలోను బిల్లును వ్యతిరేకిస్తామంటూ డ్రామాలు ఆడుతూ వచ్చిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఇప్పుడు జనం ముందుకు ఏమని వస్తారో చూడాల్సి వుంది. జిల్లా బంద్కు మంత్రి గంటా శ్రీనివాసరావు బంద్కు పిలుపునిచ్చారు. అలాగే టీడీపీ 48 గంటల బంద్కు పిలుపునిచ్చింది.