రాజధాని పనులు డ్రోన్లతో పర్యవేక్షిస్తా: సీఎం
సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణ పనులను డ్రోన్లతో పర్యవేక్షిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చెప్పారు. ఏపీ డ్రోన్ కార్పొరేషన్ సహకారంతో డ్రోన్లతో తీసిన చిత్రాలను 15 రోజులకోసారి తనకు చూపాలని ఆదేశించారు. బుధవారం ఆయన సచివాలయంలో సీఆర్డీఏ, ఏడీసీ అధికారులతో సమావేశమై రాజధాని వ్యవహారాలను సమీక్షించారు.
2,500 ఎకరాలిస్తే కాగిత పరిశ్రమ: రాష్ట్రంలోని తీరప్రాంతంలో 2,500 ఎకరాల భూమిని కేటాయిస్తే కాగిత పరిశ్రమ నెలకొల్పుతామని ఆసియా పల్ప్ అండ్ పేపర్ (ఏపీపీ) ప్రతిపాదించింది. ఏపీపీ ప్రతినిధులు బుధవారం సచివాలయంలో సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యారు. కాకినాడ, మచిలీపట్నం, కృష్ణపట్నం పోర్టు పరిసర ప్రాంతాలను పరిశీలించాలని ముఖ్యమంత్రి వారికి సూచించారు.
నగదు కొరత నివారణకు రూ.5 వేల కోట్లు పంపండి: నగదు కొరతను నివారించేందుకు ఆంధ్రప్రదేశ్కు వెంటనే రూ.5 వేల కోట్ల కరెన్సీ పంపాలని కోరుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి లేఖ రాశారు. ఆర్బీఐ గవర్నర్, ప్రాంతీయ గవర్నర్లకు కూడా సీఎం లేఖలు రాశారు. ప్రస్తుతం ఏపీలో నగదుకు కొరత ఏర్పడిందని, ఏటీఎంలలో డబ్బులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ధాన్యం విక్రయించినా డబ్బులు తీసుకోలేక రైతులు అవస్థ పడుతున్నారని, వెంటనే బ్యాంకులకు నగదు పంపాలని కోరారు.