బస్సుల కోసం విద్యార్థుల నిరసన

Students Worried About RTc Buses In srikakulam - Sakshi

సాక్షి, రేగిడి(శ్రీకాకుళం) : విద్యార్థులకు రవాణా కష్టాలు మరింత కష్టతరం కావడంతో  రోడ్డెక్కుతున్నారు. కళాశాలలకు వెళ్లే సమయంలో చాలినన్ని బస్సులు నడపకపోవడంతో ఇటీవల ఉణుకూరులో ఆందోళన చేపట్టిన ఘటన మరవక ముందే తోకలవలస జంక్షన్‌ వద్ద బుధవారం పలు గ్రామాల విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ మేరకు మండలంలోని తోకలవలసతోపాటు లింగాలవలస, వావిలవలస, బుడితిపేట, చిన్నశిర్లాం తదితర గ్రామాల విద్యార్థులు రోడ్డుపై బైఠాయించారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు రెండు బస్సులు మాత్రమే తిరుగుతున్నాయని, పాలకొండ నుంచి ఉంగరాడమెట్టకు వచ్చేసరికే పరిమితికి మించిన ప్రయాణికులతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.  

ఈ విషయమై పలుమార్లు ఆర్టీసీ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఈ విషయం తెలుసుకున్న రేగిడి పోలీసులు అక్కడకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పి ఆందోళను విరమింపజేశారు. ఆ సమయంలోనే పాలకొండ నుంచి రాజాం వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సులు విద్యార్థులు టాప్‌పైన ప్రయాణించే ప్రయత్నం కూడా చేశారు. నిత్యం ప్రాణాలతో చెలగాటమాడుతూ కళాశాలలకు వెళ్లాల్సి వస్తుందని, ఆర్టీసీ అధికారుల ఇప్పటికైనా స్పందించి అదనపు బస్సులను నడపాలని కోరుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top