అక్రమ నిర్మాణల విషయంలో శంషాబాద్ ఈఓ సుదర్శన్పై వేటు పడింది. అలాగే ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇద్దరు బిల్కలెక్టర్లపై కేసులు నమోదు కానున్నాయి.
శంషాబాద్, న్యూస్లైన్: అక్రమ నిర్మాణల విషయంలో శంషాబాద్ ఈఓ సుదర్శన్పై వేటు పడింది. అలాగే ఈ వ్యవహారంలో ప్రమేయం ఉన్న ఇద్దరు బిల్కలెక్టర్లపై కేసులు నమోదు కానున్నాయి. ఈ మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశాలు జారీ చేశారు. శంషాబాద్లో అక్రమ నిర్మాణాల విషయాన్ని తీవ్రంగా పరిగణించిన కలెక్టర్ దీనిపై ఓ అధికారి చేత పూర్తిస్థాయిలో విచారణ జరిపించారు. అనుమతులు రద్దు చేసిన వాటికి ఇంటి నంబర్లు కేటాయించినట్లు వెల్లడి కావడంతో ఈఓ సుదర్శన్ను విధుల నుంచి సస్పెండ్ చేశారు.
ఈ వ్యవహారంలో పాలు పంచుకున్న బిల్ కలెక్టర్లు సాయిరాజ్, నర్సింహలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా శంషాబాద్ ఈవోఆర్డీని కలెక్టర్ ఆదేశించారు. జీవో 111 పరిధిలో ఉన్న రాళ్లగూడ, సిద్దంతి బస్తీలో భారీ ఎత్తున గేటెడ్ కమ్యూనిటీ నిర్మాణాలను చేపట్టారు. ఈ ఏడాది ఎప్రిల్ నెలలోనే వీటి అనుమతులు రద్దు చేసిన జిల్లా ఉన్నతాధికారులు వాటిని కూల్చివేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇందుకు విరుద్ధంగా జీహెచ్ఎంసీలో శంషాబాద్ను విలీనం చేయడానికి రెండు రోజుల ముందు ఆగమేఘాల మీద భవనాలకు ఆస్తిపన్ను మదింపు చేసి, నంబర్లు కూడా కేటాయించారు. ఈ అంశాలను ప్రస్తావిస్తూ ‘అక్రమార్కులపై చర్యలకు సిద్ధం’ శీర్షికన గురువారమే ‘సాక్షి’ దినపత్రికలో కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే.