ప్రొద్దుటూరులో డాక్టర్ దంపతులను బెదిరించి రూ. 5 లక్షలు వసూలు చేసిన సంఘటనలో వద్ది ధనుంజయ, ఉమ్మడిశెట్టి రామకృష్ణ, కుండా వెంకటేశ్, కాటం వీరేంద్ర అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.
ప్రొద్దుటూరులో డాక్టర్ దంపతులను బెదిరించి రూ. 5 లక్షలు వసూలు చేసిన సంఘటనలో వద్ది ధనుంజయ, ఉమ్మడిశెట్టి రామకృష్ణ, కుండా వెంకటేశ్, కాటం వీరేంద్ర అనే వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 4 లక్షల 95 వేల రూపాయల నగదు, కత్తులు, రెండు ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. వ్యాపారంలో నష్టాలు రావడం, అప్పులు అధికం కావడం వల్లే వీరు ఈ చర్యకు పాల్పడినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
ప్రొద్దుటూరు క్రైం, న్యూస్లైన్ : ప్రొద్దుటూరులోని డాక్టర్ పి.సత్యప్రసాద్ దంపతులను బెదిరించి డబ్బు వసూలు చేసిన కేసులో నలుగురు నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక మిట్టమిడి వీధికి చెందిన వద్ది ధనుంజయ, ఉమ్మడిశెట్టి రామకృష్ణ, ఈశ్వరరెడ్డి నగర్కు చెందిన కుండ్లా వెంకటేశ్, అమృతానగర్కు చెందిన కాటం వీరేంద్రలను అరెస్ట్ చేసి రూ.4,95,000 నగదు, నాలుగు కత్తులు, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ వివరాలను డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి, సీఐ మహేశ్వరరె డ్డిలు త్రీ టౌన్ పోలీస్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. డాక్టర్ సత్యప్రసాద్ గాంధీరోడ్డులో భవ్య నర్సింగ్హోం నిర్వహిస్తున్నారు.
ఈ నెల 19న ఓ వ్యక్తి ఆయనకు ఫోన్ చేసి మేము సునీల్ గ్యాంగ్ మనుషులం.. మాకు రూ.30 లక్షలు కావాలంటూ బెదిరిం చాడు. లేదంటే మీతోపాటు మీ పిల్లల్ని కూడా చంపేస్తామని హెచ్చరించాడు. తర్వాత ఫోన్ చేసినపుడు తన వద్ద అంత డబ్బు లేదు రూ. 5లక్షలు అయితే ఇస్తానని డాక్టర్ చెప్పారు. ఆ డబ్బుతో అయ్యప్పస్వామి ఆలయం వద్దకు రావాలని చెప్పగా అక్కడికి వెళ్లారు. నలుగురు వ్యక్తులు డాక్టర్ వద్ద డబ్బు తీసుకుని ఎవరితోనైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.
పోలీసులకు ఫిర్యాదు
డాక్టర్ సత్యప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేశారు. శుక్రవారం భగత్సింగ్ కాలనీ సర్కిల్లో టూ టౌన్ ఎస్ఐ ఇబ్రహీం, త్రీ టౌన్ ఎస్లు హేమకుమార్, తిరుపాలు తమ సిబ్బందితో వాహన తనిఖీ చేపట్టారు.
అదే సమయంలో కొర్రపాడు వైపు నుంచి రెండు మోటర్ బైకుల్లో వస్తున్న ధనుంజయ, రామకృష్ణ, వెంకటేష్, వీరేంద్రలు పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించి అదుపులోకి తీసుకొని విచారించగా డాక్టర్ దంపతులను బెదిరించింది తామేనని అంగీకరించారు.
ధనుంజయకు బట్టల షాపుతో పాటు ఇన్వెర్టర్ల షాపు కూడా ఉంది. రెండు షాపుల్లోను విపరీతమైన నష్టాలు వచ్చి అప్పులు పెరిగిపోయాయి. వాటిని పూడ్చుకోవడానికి అతను తన మిత్రులైన రామకృష్ణ, వెంకటేష్, వీరేంద్రలను ఆశ్రయించాడు. నలుగురు కలిసి చర్చించుకున్న తర్వాత పట్టణంలో డబ్బున్న వారిని బెదిరించి డబ్బు వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే డాక్టర్ సత్యప్రసాద్ను ఫోన్లో బెదిరించి డబ్బు తీసుకున్నారు. చివరకు కటకటాలపాలయ్యారు. వారిని పట్టుకోవడానికి కృషి చేసిన ఎస్ఐలతోపాటు సిబ్బంది నాయక్, నాగ,సంజీవ్, నాగేశ్వరరెడ్డిలను డీఎస్పీ అభినందించారు. రివార్డు కోసం ఎస్పీకి సిఫార్సు చేస్తానన్నారు.