చింతమనేని వీడియో సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారంటూ..

Police Arrest Dalit Leaders Over TDP MLA Chintamaneni Prabhakar Complaint - Sakshi

సాక్షి, పశ్చిమగోదావరి : టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌పై కనీసం కేసు కూడా నమోదు చేయని పశ్చిమ పోలీసులు.. ఆయన తీరును నిరసించినందుకు దళితులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. దళితుల గురించి అసభ్య పదజాలం ఉపయోగిస్తూ చింతమనేని మాట్లాడిన వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారంటూ వైఎస్సార్‌ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, దళిత నేత కత్తుల రవి జైన్‌ను పెదపాడు పోలీసులు అరెస్టు చేశారు. దీంతో దళిత సంఘాలు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రవిని వెంటనే విడిచి పెట్టకపోతే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.(మీరు దళితులు.. మీకెందుకురా రాజకీయాలు)

కాగా ‘దళితులు.. మీకెందుకురా రాజకీయాలు’  అంటూ దెందలూరు ఎమ్మెల్యే చింతమనేని దళిత వర్గాన్ని తీవ్రంగా అవమానించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనపై కేసు నమోదు చేయాలంటూ దళిత నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. అయితే తన గురించి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారంటూ చింతమనేని ఇచ్చిన ఫిర్యాదుపై మాత్రం వెంటనే స్పందించారు. ఆయన వీడియోను షేర్‌ చేశారంటూ రవిని అరెస్టు చేశారు. పోలీసుల పక్షపాత వైఖరిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్‌ల అండ చూసుకుని రెచ్చిపోతున్న చింతమనేనికి పోలీసులు కూడా వత్తాసు పలుకుతున్నారంటూ ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతున్నాయి(మరోసారి రెచ్చిపోయిన చింతమనేని.. ఉద్రిక్తత)

జూపూడి, కారెం శివాజీలపై దళితుల ఆగ్రహం
చింతమనేని ప్రభాకర్‌ వైఖరిని నిరసిస్తూ దళిత సంఘాలు తణుకులో ఆందోళన చేపట్టాయి. చింతమనేని అరెస్టు చేయాలంటూ తణుకు జాతీయ రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగాయి. ఈ సందర్భంగా చింతమనేని వ్యాఖ్యలపై స్పందించని జూపూడి, కారెం శివాజీలపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల ధర్నాకు వైఎస్సార్‌ సీపీ నేత కారుమూరి నాగేశ్వరరావు మద్దతుగా నిలిచారు. ఆయన కూడా ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు.(చింతమనేనిపై భగ్గుమన్న దళితులు)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top