పాకిస్థాన్ సైన్యం భారత సైనికులపై జరుపుతున్న దుశ్చర్యను నిరసిస్తూ నగరంలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు.
హైదరాబాద్: పాకిస్థాన్ సైన్యం భారత సైనికులపై జరుపుతున్న దుశ్చర్యను నిరసిస్తూ నగరంలో ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు. బిజెపి, యువజన కాంగ్రెస్ వేరువేరుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. ఐఎస్ఐ తీవ్రవాదులతో కలిసి పాకిస్థాన్ దాడులకు పాల్పడుతోందని మండిపడ్డారు.
హైదరాబాద్ నారాయణగూడలో బిజెపి అధ్వర్యంలో పాకిస్థాన్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సరిహద్దుల్లోకి పొరుగుదేశం చొచ్చుకు వస్తున్నా దాడులను నియంత్రించడంలో కేంద్రం విఫలమైందని బిజెపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
దేశ సరిహద్దుల్లో భారత జవాన్లపై పాకిస్థాన్ ముష్కరుల దాడిని ఖండిస్తూ ఏపీ యూత్ కాంగ్రెస్ ఆందోళన చేపట్టింది. హైదరాబాద్ బషీర్ బాగ్ చౌరస్తాలో యూత్ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పాకిస్థాన్ జెండాను, దిష్టిబొమ్మను దహనం చేశారు. పాకిస్థాన్ ఇలాంటి కవ్వింపు చర్యలు మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.