మారని చంద్రబాబు! | No change in Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

మారని చంద్రబాబు!

Oct 12 2014 6:56 PM | Updated on Jul 25 2018 4:07 PM

మారని చంద్రబాబు! - Sakshi

మారని చంద్రబాబు!

చాలా కాలం తరువాత అధికారంలోకి వచ్చినప్పటికీ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో మార్పు రాలేదని రైతులు విమర్శిస్తున్నారు.

చాలా కాలం తరువాత అధికారంలోకి వచ్చినప్పటికీ ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడులో మార్పు రాలేదని రైతులు విమర్శిస్తున్నారు. రైతుల పట్ల గతంలో వ్యవహరించినమాదిరిగానే ఆయన వ్యవహరిస్తున్నారన్నారు.  న్యాయం కావాలని వచ్చిన తమపై లాఠీ ఛార్జి చేయించారని వారు వాపోతున్నారు.  సరస్వతి పవర్‌ మైనింగ్‌ లీజును పునరుద్దరించాలని హైదరాబాద్లోని చంద్రబాబు క్యాంప్‌ కార్యాలయం ఎదుట  గుంటూరు జిల్లా మాచవరం, దాచేపల్లి మండలాల రైతులు ఈరోజు ధర్నా నిర్వహించారు. చెన్నాయిపాలెం, వేమవరం, తంగెడ గ్రామాలకు చెందిన రైతులు ఈ ధర్నాలో పాల్గొన్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే మైనింగ్‌ను రద్దు చేశారని రైతులు ఆరోపించారు.

భూముల విషయంలో టీడీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తూ తమ మధ్య చిచ్చుపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు, సీఎంకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. సరస్వతి పవర్‌కు స్వచ్ఛందంగానే భూములు విక్రయించామని  రైతులు చెప్పారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం తమ జీవితాలను బలి చేస్తారా? అని వారు ప్రశ్నించారు. ప్రభుత్వం తక్షణమే  మైనింగ్‌ లీజును పునరుద్ధరించాలని వారు డిమాండ్ చేశారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న  రైతులను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు.  

ఆ తరువాత రైతులు వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డిని కలిశారు. వారికి జగన్ ధైర్యం చెప్పారు. న్యాయం చేయమని అడిగేందుకు వెళ్లిన రైతులపై లాఠీచార్జ్‌ చేయడం అమానుషమని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు మనిషి రూపంలో ఉన్న రాక్షసుడని తీవ్రస్థాయిలో విమర్శించారు.  వేరెవరూ ఫ్యాక్టరీలు పెట్టకూడదనే దురుద్దేశంతోనే సిమెంట్‌ ఫ్యాక్టరీ అనుమతులు రద్దు చేశారని మండిపడ్డారు. ఫ్యాక్టరీ స్థాపనకు న్యాయపోరాటానికైనా సిద్ధమని  రైతులకు ధైర్యం చెప్పారు.

 రైతుల ముఖాల్లో ఆనందం చూడటం కోసమే నాడు ఎకరా మూడు లక్షల రూపాయలకు కొనుగోలు చేసినట్లు చెప్పారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి కావాల్సిన అనుమతిలన్నీ వచ్చినా, ఏపీ ప్రభుత్వం నుంచి మాత్రం అనుమతులు రాలేదన్నారు. నీళ్లు, కరెంటు లేనిదే ఏ పరిశ్రమనూ స్థాపించలేమన్నారు. పరిశ్రమల స్థాపనకు నీళ్లు, కరెంటు ఇవ్వాల్సిన ధర్మం ప్రభుత్వంపై ఉందన్నారు. సరస్వతి సిమెంట్కు అనుమతులు ఇవ్వకపోగా, మైనింగ్ లీజ్ రద్దు చేయడం చంద్రబాబు కక్ష సాధింపులో ఒక భాగమేనన్నారు. దాచేపల్లి-మాచవరం మండలాల్లో మరో ఏడు పరిశ్రమలకు అనుమతులు లభించినా, ఇప్పటివరకూ ఏ ఫ్యాక్టరీని స్థాపించకపోవడం సిగ్గు చేటన్నారు. టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి భూములను ఎందుకు రద్దు చేయలేదని జగన్ ప్రశ్నించారు. కోర్టులను ఆశ్రయించైనా సరస్వతీ సిమెంట్ ఫ్యాక్టరీని పెట్టి తీరతామన్నారు.

చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి నీచమైన రాజకీయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మోసాలను ప్రశ్నించడానికి దాచేపల్లి- మాచవరం మండలాల నుంచి పెద్దఎత్తున రైతులు హైదరాబాద్ వస్తే అన్యాయంగా పోలీసులతో అరెస్ట్ చేయించారని చెప్పారు. ప్రజా వ్యతిరేకతను తప్పించుకోవడానికి చంద్రబాబు దిగజారుడుతనానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. దేవుడు చంద్రబాబుకు మొట్టికాయలు వేసే రోజు దగ్గరపడిందని జగన్ అన్నారు.
**

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement