మౌంట్‌అబూలో చిక్కుకున్న బ్రహ్మకుమారీలు | Sakshi
Sakshi News home page

మౌంట్‌అబూలో చిక్కుకున్న బ్రహ్మకుమారీలు

Published Sun, Apr 26 2020 4:36 AM

Nearly a thousand people from the Telugu states were trapped in Mount Abu - Sakshi

సాక్షి, అమరావతి బ్యూరో:  తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు వెయ్యి మంది రాజస్థాన్‌లోని మౌంట్‌ అబూలో చిక్కుకుపోయారు. వీరిలో ఉభయ గోదావరి, విశాఖ జిల్లాలతో పాటు తెలంగాణలోని వరంగల్‌ తదితర ప్రాంతాలకు చెందిన వారున్నారు. వీరు మార్చి 13న బయల్దేరి 17కి మౌంట్‌ అబూ చేరుకున్నారు. మార్చి 22, 23 తేదీల్లో రైళ్లలో తిరుగు ప్రయాణానికి రిజర్వేషన్లు చేయించుకున్నారు. ఇంతలో లాక్‌డౌన్‌ వల్ల రైళ్లు రద్దవడంతో అక్కడే ఉండిపోయారు. అందులో సగం మంది బ్రహ్మకుమారీలు కాగా మిగిలిన వారు రైతులు. నెల రోజులుగా మౌంట్‌ అబూలోనే ఉండిపోవడంతో వారు తల్లడిల్లిపోతున్నారు.

తమ పంటలు కోతలకు వచ్చాయని, తాము వెళ్లకపోతే తీవ్రంగా నష్టపోతామని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం పండించిన పంట చేతికొచ్చే వేళ తమను త్వరగా స్వస్థలాలకు చేర్చాలని కోరుతున్నారు. మౌంట్‌ అబూలో బ్రహ్మకుమారీస్‌ సంస్థ వారే తమకు భోజనం, వసతి సమకూరుస్తున్నారని వీరు చెబుతున్నారు. కరోనా సోకకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నామని తూర్పుగోదావరి జిల్లా పసలపూడికి చెందిన బ్రహ్మకుమారీస్‌ ప్రతినిధి మాధవి ‘సాక్షి’కి తెలిపారు. మే 3న లాక్‌డౌన్‌ ఎత్తివేశాక తమను ప్రత్యేక రైళ్లలో స్వస్థలాలకు పంపాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అభ్యర్థిస్తున్నామన్నారు. ప్రభుత్వ నిబంధనలను తప్పక పాటిస్తామన్నారు. తమకు సాయం చేయాలని రాజస్థాన్‌ సీఎంకు  కూడా బ్రహ్మకుమారీస్‌ సంస్థ విజ్ఞప్తి చేసింది. 

Advertisement
Advertisement