టైపిస్టును చెప్పుతో కొట్టిన ఎంపీపీ భర్త | MPP husband attacks MPDO typist with slipper in anantapur | Sakshi
Sakshi News home page

టైపిస్టును చెప్పుతో కొట్టిన టీడీపీ వర్గీయులు

Apr 12 2017 9:20 AM | Updated on Jul 6 2019 1:14 PM

అధికారంలో ఉన్నామనే అహంకారంతో టీడీపీ వర్గీయుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నాయి.

అనంతపురం:  అధికారంలో ఉన్నామనే అహంకారంతో టీడీపీ వర్గీయుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతున్నాయి. ఇటీవల విజయవాడలో ఎంపీ కేశినేని నాని.. రవాణా శాఖ అధికారిని దుర్బాషలాడి అనంతరం ఆ అధికారికి క్షమాపణ చెప్పిన వైనం మర్చిపోకముందే అనంతపురం జిల్లాలో మరో సంఘటన చోటుచేసుకుంది. కనగానపల్లెలో మంత్రి పరిటాల సునీత వర్గీయులు ఎంపీడీఓ కార్యాలయ టైపిస్టు మూర్తిపై దౌర్జన్యం చేశారు. తాము చెప్పినట్లు వృద్ధాప్య పెన్షన్ల జాబితా తయారు చేయలేదనే కోపంతో టైపిస్టును ఎంపీపీ భర్త ముకుందనాయుడు చెప్పుతో కొట్టారు.

అడ్డుకోబోయిన ఎంపీడీఓ జలజాక్షిని దుర్భాషలాడారు. ఈ దౌర్జన్యంపై  మంత్రి సునీత దృష్టికి తీసుకెళ్లారు. అయితే తెలుగు తమ్ముళ్ల వ్యవహారాన్ని వెనకేసుకొచ్చిన మంత్రి... ఓ సారీ చెప్పిస్తే సరిపోతుందని  అనడంతో వారు ఖంగుతిన్నారు. కాగా, టీడీపీ నాయకుల భయంతో టైపిస్టు, ఎంపీడీఓలు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. మరోవైపు ఈ ఘటనను వైఎస్‌ఆర్‌ సీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ ఉద్యోగులపై దాడిని ఖండిస్తున్నామని, మంత్రి పరిటాల వ్యవహార శైలిని ముఖ్యమంత్రి పునపరిశీలించాలని ఆయన అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement