‘బస్‌’తీ మే సవాల్‌!

lady cunductors suffering late timings - Sakshi

మహిళా కండక్టర్లకు అడుగడుగునా సవాళ్లు

కానరాని విశ్రాంతి గదులు

రాత్రి 10 దాటినా విధుల్లోనే

తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్న వైనం  

క్షణం తీరిక లేని షెడ్యూళ్లు, విశ్రాంతి తీసుకుందామంటే కుదరని పరిస్థితులు, రాత్రి పది దాటినా తరగని డ్యూటీలు మహిళా కండక్టర్లకు నిత్యం సవాళ్లు విసురుతున్నాయి. ఆర్టీసీలో పని చేస్తున్న అతివలు అనునిత్యం కష్టాలతో ప్రయాణిస్తున్నారు. వసతుల లేమి, పర్యవేక్షణ లోపంతో తీవ్రమైన మానసిక ఒత్తిడి అనుభవించాల్సి వస్తోంది. మహిళలంటే ఇంటి పని తప్పనిసరి. అవి చూసుకుని డ్యూటీకి వస్తుంటే కనీసం నిబంధనల ప్రకారం కల్పించాల్సిన సదుపాయాలు కూడా కల్పించడం లేదు. ఫలితంగా పడతులు నలిగిపోతున్నారు. 

అడుగడుగునా ఇబ్బందులు
జిల్లా వ్యాప్తంగా శ్రీకాకుళం ఒకటి, శ్రీకాకుళం రెండు డిపోలు, పాలకొండ, టెక్కలి, పలాస తదితర ఐదు డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల్లో పనిచేసే మొత్తం కండక్టర్లు 690 మంది. కాగా 525 మంది పురుష కండక్టర్లు అయితే 165మంది మహిళా కండక్టర్లు పనిచేస్తున్నారు. ఇందులో శ్రీకాకుళం ఒకటో డిపోలో 29 మంది మహిళలు, శ్రీకాకుళం రెండో డిపోలో 48, పాలకొండ డిపో పరిధిలో 44, టెక్కలి డిపో పరిధిలో 20, పలాస డిపో పరిధిలో 24 మంది మహిళా కండక్టర్లు పనిచేస్తున్నారు. వీరంతా ఆయా డిపోల పరిధి లో విధులు నిర్వహిస్తున్నారు. డ్యూటీలు నిర్వహించే సమయంలో అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు. బ స్సుల రూట్లలో ఉన్న ఎగుడు, దిగుడు గుం తల కారణంగా నడుమ, కీళ్ల నొప్పులతో బాధపడుతున్నామని వారు చెబుతున్నారు.

వేకువజాము నుంచి..
సూరీడు రాక ముందే ఆరంభమయ్యే కండక్టర్ల విధులు చిమ్మచీకటి వరకు సాగుతాయి. అందులోనూ నిత్యం జనాల మధ్య ఉండాల్సిన జాబు కావడంతో కాసింతైనా విశ్రాంతి తీసుకోవడం తప్పనిసరి. కానీ మహిళా కండక్టర్లకు ఆ కాసింత భాగ్యం దక్కడం లేదు. విధి నిర్వహణలో తగిన విశ్రాంతి లేక తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. పనిచేసే చోట పలు రకాల ఇబ్బందులు తప్పడం లేదు. ఆకతాయిలు, మందుబాబులు, మరో వైపు తోపులాటలు భరిస్తూ విధులు నిర్వహించాల్సి వస్తోంది. నిబంధనల మేరకు సంస్థలో కార్మికులంతా 8గంటలు పనిచేయాల్సి ఉన్నా 12 నుంచి 15గంటలపాటు పనిచేయించుకుంటున్నారు. దీంతో ఎక్కువమంది మహిళా కండక్టర్లు మానసిక ఒత్తిడిలకు గురై అనారోగ్యం పాలవుతున్నారు.

పని.. పని.. పని
జిల్లా ఆర్టీసీ పరిధిలో పనిచేసే ఐదు డిపోల్లో 165 మం ది మహిళా కండక్టర్లు పని చేస్తున్నారు. వీరు రోజుకు 8 గంటలు పని చేస్తో సరిపోతుంది. కానీ ఓటర్‌ టైమ్‌ అంటూ వీరికి అనువు కాని సమయాల్లో విధులు వేస్తున్నారు. రోజుకు 12 నుంచి 15గంటల పాటు తప్పనిసరిగా పని చేయాల్సి రావడంతో వీరు డస్సిపోతున్నా రు. ఇంటి పనులకు సమయం కేటాయించలేకపోతున్నారు. ఓవర్‌టైం విధులు వేయకుండా పగటి పూట విధులు చేసేలా డ్యూటీ చార్టులు వేయాలని మహిళా కండక్టర్‌లు కోరుకుంటున్నా ఫలితం లేకుండా పోతోంది.

విశ్రాంతి గదులేవీ?
జిల్లా వ్యాప్తంగా అన్ని డిపోల్లో మహిళా కండక్టర్లు విశ్రాంతి తీసుకునేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేయాలి. కానీ జిల్లా పరిధిలోని ఐదు డిపోల్లో ఒక్క డిపోలో కూడా విశ్రాంతి గదులు లేవు. ఇతరత్రా మౌలి క సదుపాయాలు కల్పించడంలోనూ ఆర్టీసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. డ్యూటీకి వెళ్లాల్సిన మహిళలు గంట ముందే వస్తే కొద్ది సేపు విశ్రాంతి తీసుకునేందుకు గదులు లేవు. ఇంటికి వెళ్లాలంటే కిలోమీటర్ల మేర దూరం ఉండడంతో ఆర్టీసీ కాంప్లెక్స్‌ల్లోనే కాసేపు సేద తీరుతున్నారు. వారి కోసం ప్రత్యేక చార్టు డ్యూటీలు వేయాలని కోరుతు న్నా అధికా రులు ఎవ్వరూ స్పందించడం లేదు. కొంతమంది మహిళా సిబ్బందిని పల్లె వెలుగు, ఇతర ఆర్డినరీ సర్వీస్‌ డ్యూటీలకు పంపుతున్నారు. దీంతో వారు మరిన్ని ఇబ్బందులు పడుతున్నారు. మహిళా సిబ్బంది అనా రోగ్యానికి గురైనపుడు నిబంధనల మేరకు వేచి చూడాలి. అక్కడ నిల్చుంటే ఆకతాయిల వేధింపులు తప్పడం లేదు. ఆటోల్లో, ఇతర వాహనాల్లో వెళ్లాలంటే రాత్రిపూట అధిక చార్జీలు వసూలు చేస్తున్నారు. సాయంత్రం సరికి డ్యూటీలు ముగిసేలా డ్యూటీలు వేయాలని వేడుకుంటున్నా అధికారులు వినిపించుకోవడం లేదు. మగవారితో సమానంగా జీతా లు ఇస్తున్నాం కదా, అలాంటప్పుడు డ్యూటీలు కూడా వారితో సమానంగా చేయాల్సిందేనని చెబుతున్నారు.

రాత్రి 10 దాటినా విధుల్లోనే
రాత్రి 10గంటలు దాటిన తర్వాత కూడా విధుల్లో మహిళా సిబ్బంది కనిపిస్తున్నారు. వీరు ఎక్కడా రాజీ పడకుండా విధులు నిర్వహిస్తున్నారు. విధులు కేటా యించడంలో సానుకూలంగా వ్యవహరించాలని కోరుతున్నా అధికారులు మాత్రం ససేమిరా అంటున్నారు. 8గంటలు డ్యూటీ విధులు కన్నా అదనంగా 4గంటలు నుంచి 6గంటలు చేస్తే మరసటి రోజు సెలవు తీసుకునే వెసులుబాటు ఉందని అధికారులు చెబుతున్నా అది అమలు కావడం లేదు. రాత్రి 10గంటలు తర్వాత డ్యూటీ ముగించుకుని తిరిగి డిపోకు చేరుకుని డబ్బులు లెక్క కట్టి ఇంటికి వెళ్లే లోపు అర్ధరాత్రి అవుతోందని పలువురు మహిళా కండక్టర్లు చెబుతున్నారు. 

పనిభారం లేకుండా చూస్తాం
సాధ్యమైనంత వరకూ మహిళా కండక్టర్లపై పనిభారం లేకుండా చూస్తాం. మహిళలకు మూడు రోజుల సెలువులు మంజూరుకు అనుమతులు వచ్చాయి. ఇందుకు సంబంధించిన అనుమతులు అన్ని డిపోలకు పంపిస్తాం. అన్ని డిపోల్లో విశ్రాంతి గదులు కూడా నిర్మించనున్నాం. శ్రీకాకుళం ఒకటో డిపో పరిధిలో ఇప్పటికే విశ్రాంతి గది నిర్మాణం జరుగుతోంది. త్వరలోనే ప్రారంభిస్తాం. సాధ్యమైనంత వర కూ సింగిల్‌ డ్యూటీలు వేసేందుకే ప్రాధాన్యత ఇస్తున్నాం. తప్పని పరిస్థితుల్లో మాత్రమే డబుల్‌ డ్యూటీకి పంపుతాం.
కె.శ్రీనివాసరావు, ఆర్టీసీ డిప్యూటీ చీఫ్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌

పట్టించుకోవడం లేదు
ఏపీఎస్‌ ఆర్టీసీలో 18 ఏళ్లుగా కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నాను. మహిళా కండక్టర్లకు కనీస సౌకర్యాలు లేవు. విధి నిర్వహణ సమయంలో డ్యూటీకి, డ్యూటీకి మధ్య వ్యవధిలో కనీస విశ్రాంతి తీసుకునేందుకు కూడా విశ్రాంతి గదులు లేవు. ఇక విధి నిర్వహణలో ఎదుర్కొంటున్న సమస్యలు వర్ణించలేనివి. విధి నిర్వహణలో ఓటీ చేసినపుడు రాత్రి 10.15గంటల సమయం అవుతుంది. ఆ సమయంలో ఇంటికి చేరుకోవాలంటే నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
– జీవీ రమణమ్మ, మహిళా కండక్టర్‌

విద్యార్థులతో ఇబ్బందులు
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే విద్యార్థులతో ప్రతి రోజూ ఉద యం పూట, సాయంత్రం సమయాల్లో ఇబ్బందులు తప్పడం లేదు. బస్సుల్లో ప్రయాణించే సమయాల్లో ఫుట్‌పాత్‌లపైనే నిలబడి పయనిస్తున్నారు. లోపలికి రమ్మంటే వినే పరిస్థితి లేదు. ఎక్కడ పడిపోతారేమోనని భయపడాల్సిన పరిస్థితి. గతంలో డబుల్‌ డోర్‌ బస్సులతో సమస్యలు తలెత్తేవి. ఇపుడు సింగిల్‌ డోర్‌ ఉండడంతో కొంతమేర ఇబ్బందులు తప్పాయి.
– ఎస్‌.లీలావతి, మహిళా కండక్టర్‌

చిల్లర సమస్య వేధిస్తోంది
ఆర్టీసీలో 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తున్నాను. విధినిర్వహణలో ఎక్కువగా చిల్లర సమస్య వేధిస్తోంది. ఇందుకోసం ప్రయాణికులు గొడవలు పడిన సందర్భాలు అనేకం. కొంతమంది దురుసుగా కూడా ప్రవర్తిస్తుంటారు. మహిళా కండక్టర్ల సమస్యలు యాజమాన్యం కూడా పట్టించుకోవడం లేదు. మహిళా కండక్టర్‌లకు విశ్రాంతి లేదు.
డి.వనజాక్షి, మహిళా కండక్టర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top