అంబటి సహా కాపునేతల హౌస్‌ అరెస్టు | Kapu leaders house arrest including Ambatirambabu | Sakshi
Sakshi News home page

అంబటి సహా కాపునేతల హౌస్‌ అరెస్టు

Jul 27 2017 2:38 AM | Updated on Jul 30 2018 6:21 PM

గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి కాపునేతల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది.

సాక్షి నెట్‌వర్క్‌: గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి కాపునేతల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది. జిల్లావ్యాప్తంగా మూడువేల మందికిపైగా కాపు నాయకులకు నోటీసులు ఇచ్చి పోలీసు స్టేషన్‌కు పిలిపించి బైండోవర్‌ చేశారు. గుంటూరు రూరల్‌  జిల్లాలో 372 మందిని, 243 మందిని ముందస్తుగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లో ఉంచారు. కాపు ముఖ్యనేతలు అంబటిరాంబాబు, కావటి మనోహర్‌నాయుడు, దాసరి రాముతోపాటు మరో ముగ్గురు కాపు ముఖ్యనేతలను హౌస్‌ అరెస్టులు చేశారు. రాజధాని ప్రాంతంలో సైతం పోలీసులు భారీ ఎత్తున మోహరించి కాపునేతలు ఎవరూ అక్కడికి రాకుండా పూర్తిస్థాయిలో కట్టడి చేశారు.

గుంటూరు రైల్వే స్టేషన్, బస్‌స్టేషన్‌లలో డాగ్, బాంబ్‌ స్క్వాడ్‌ల తనిఖీలు నిర్వహించారు. బుధవారం రాత్రి కూడా పోలీసు పహారా కొనసాగుతూనే ఉంది. కృష్ణా జిల్లాలోనూ కాపులు, కాపు సంఘాల నేతలు, కార్యకర్తలపై పోలీసులు కన్నెర్ర చేశారు. మంగళవారం జిల్లాలోని పలువురు కాపు నేతలకు ఫోన్‌లలో బెదిరింపులకు పాల్పడిన పోలీసు యంత్రాంగం బుధవారం కొందరు కార్యకర్తలపై కేసులు నమోదు చేయగా పలువురు నాయకులను గృహనిర్భందం చేసింది. హనుమాన్‌జంక్షన్‌లో వైఎస్సార్‌ సీపీ నేత దుట్టా రామచంద్రరావును అక్కడి పోలీసులు గృహనిర్బంధం చేశారు. నూజివీడులో కాపునాడు నాయకుడు శీలం వెంకటేశ్వరరావును హౌస్‌ అరెస్ట్‌ చేసిన పోలీసులు వారితోపాటు జిల్లాలోని మరో 48 మందిపై బైండోవర్‌ కేసులు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement