గుంటూరు జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి కాపునేతల అరెస్టుల పర్వం కొనసాగుతూనే ఉంది.
గుంటూరు రైల్వే స్టేషన్, బస్స్టేషన్లలో డాగ్, బాంబ్ స్క్వాడ్ల తనిఖీలు నిర్వహించారు. బుధవారం రాత్రి కూడా పోలీసు పహారా కొనసాగుతూనే ఉంది. కృష్ణా జిల్లాలోనూ కాపులు, కాపు సంఘాల నేతలు, కార్యకర్తలపై పోలీసులు కన్నెర్ర చేశారు. మంగళవారం జిల్లాలోని పలువురు కాపు నేతలకు ఫోన్లలో బెదిరింపులకు పాల్పడిన పోలీసు యంత్రాంగం బుధవారం కొందరు కార్యకర్తలపై కేసులు నమోదు చేయగా పలువురు నాయకులను గృహనిర్భందం చేసింది. హనుమాన్జంక్షన్లో వైఎస్సార్ సీపీ నేత దుట్టా రామచంద్రరావును అక్కడి పోలీసులు గృహనిర్బంధం చేశారు. నూజివీడులో కాపునాడు నాయకుడు శీలం వెంకటేశ్వరరావును హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు వారితోపాటు జిల్లాలోని మరో 48 మందిపై బైండోవర్ కేసులు నమోదు చేశారు.