ఉద్యమ జోహార్లు | Homage to the movement | Sakshi
Sakshi News home page

ఉద్యమ జోహార్లు

Sep 12 2013 3:19 AM | Updated on Oct 20 2018 6:17 PM

సమైక్య పోరులో అసువులుబాసిన ఉపాధ్యాయుడు బట్టా శంకరయ్య యాదవ్ (52) భౌతిక కాయానికి ఆయన స్వగ్రామమైన గొల్లపాళెంలో సమైక్యాంధ్ర నినాదాల మధ్య బుధవారం అంతిమయాత్ర నిర్వహించారు.

దొరవారిసత్రం, న్యూస్‌లైన్:  సమైక్య పోరులో అసువులుబాసిన ఉపాధ్యాయుడు బట్టా శంకరయ్య యాదవ్ (52) భౌతిక కాయానికి ఆయన స్వగ్రామమైన గొల్లపాళెంలో సమైక్యాంధ్ర నినాదాల మధ్య బుధవారం అంతిమయాత్ర నిర్వహించారు. జోరుగా వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా జేఏసీ నాయకులు, ఉపాధ్యాయులు, రెవెన్యూ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పలు ప్రజాసంఘాల నేతలు శంకరయ్య భౌతికకాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అన్నమేడు జిల్లా ప్రజాపరిషత్ పాఠశాల్లో మూడేళ్లుగా ఎన్‌ఎస్‌ను బోధిస్తూ సమైక్య ఉద్యమంలో భాగంగా దీక్షలో కూర్చుని మంగళవారం మృతిచెందిన విషయం విదితమే.
 
 ప్రేమగా పలకరించే వ్యక్తి శంకరయ్య
 తమను ఎంతో ప్రేమగా పలకరించేవారని గొల్లపాళెం వాసులు శంకరయ్యయాదవ్ గురించి గుర్తు చేసుకున్నారు. ఉద్యోగ రీత్యా నాయుడుపేటలో పదేళ్లుగా నివాసముంటున్నారు. గ్రామస్తులు, తెలిసిన వారు కనిపిస్తే ఎంతో ఆదరణగా మాట్లాడేవారని, అందరి బాగోగులు తెలుసుకునేవాడని స్థానికులు కన్నీటిపర్యంతమయ్యారు. స్వగ్రామానికి వచ్చినప్పుడు వృద్ధులు, పేదలకు ఆర్థిక సాయం చేసేవారని కొనియాడారు. యాదవ్ సంఘం పరంగా ఎంతోమందికి సేవలందించినట్టు పలువురు జ్ఞాపకం చేసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement