
‘అంగీకరించాల్సింది ప్రతిపక్షం కాదు, కేంద్రం’
రాష్ట్ర వృద్ధిరేటుపై తాము అనుసరించిన మెథడాలజీ సమగ్రంగానే ఉందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
అమరావతి : రాష్ట్ర వృద్ధిరేటుపై తాము అనుసరించిన మెథడాలజీ సమగ్రంగానే ఉందని ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తాము చూపించిన గ్రోత్ రేట్లను అంగీకరించాల్సి ప్రతిపక్షం కాదని, ప్రభుత్వ నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదించాలన్నారు. ఈసారి బడ్జెట్లో యూత్ పాలసీని తీసుకొస్తామని, నిరుద్యోగ భృతి ఎలా ఇవ్వాలన్నది పరిశీలిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్రంలో అప్పులు పెరుగుతున్నాయని, రెవిన్యూ తగ్గుతోందని యనమల అన్నారు. గత ఏడాది బడ్జెట్ కంటే ఈసారి అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. పుష్కరాలు, రాధాని నిర్మాణాలకు అధికంగా నిధులు ఖర్చు పెట్టామని తెలిపారు. బీసీలు, సంక్షేమ రంగాలకు కేటాయించిన నిధులను సక్రమంగా ఖర్చు చేయని మాట వాస్తవమే అని అంగీకరించారు. ఇక మీదట అలా జరగకుండా చూస్తామని తెలిపారు. త్వరలో ఎంబీసీ కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని యనమల పేర్కొన్నారు.