కదలరు.. మెదలరు..! | government employees are not sliding their transferred place | Sakshi
Sakshi News home page

కదలరు.. మెదలరు..!

Sep 16 2013 1:38 AM | Updated on Apr 4 2019 2:50 PM

జిల్లా రెవెన్యూ శాఖలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడి ఉద్యోగులు బదిలీ అయినా స్థానం మారకుండా కాలం గడిపేస్తారు. బదిలీ ఉత్తర్వులను సైతం ధిక్కరించి తామనుకున్నది జరిగేలా ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడి చేసి పంతం నెగ్గించుకుంటారు.


 సాక్షి, రంగారెడ్డి జిల్లా :  
 జిల్లా రెవెన్యూ శాఖలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఇక్కడి ఉద్యోగులు బదిలీ అయినా స్థానం మారకుండా కాలం గడిపేస్తారు. బదిలీ ఉత్తర్వులను సైతం ధిక్కరించి తామనుకున్నది జరిగేలా ఉన్నత స్థాయి నుంచి ఒత్తిడి చేసి పంతం నెగ్గించుకుంటారు. మూడు నెలల క్రితం జిల్లా రెవెన్యూ శాఖలో తహసీల్దార్లు, ఉప తహసీల్దార్ల బదిలీలు జరిగాయి. ఇందులో భాగంగా 17 మంది ఉప తహసీల్దార్లకు స్థానమార్పిడి కలిగింది. అయితే వీరిలో కొందరు సీటు మారినప్పటికీ.. మరికొందరు మాత్రం అదే సీట్లో తిష్ట వేశారు. ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి పెంచి కోరిన సీటు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు. శేరిలింగంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో పనిచేసే ఓ డిప్యూటీ తహసీల్దార్ మూడు నెలల క్రితం చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయానికి బదిలీ అయితే.. ఆ స్థానంలో కాకుండా చేవెళ్ల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు. అదేవిధంగా చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయంలో పనిచేసే ఓ డిప్యూటీ తహసీల్దార్ చేవెళ్ల తహసీల్దార్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. అయితే ఆయన అక్కడ విధుల్లో చేరకుండా రాజేంద్రనగర్ ఆర్డీఓ కార్యాలయంలో విధులు నిర్వర్తిస్తుండటం గమనార్హం.
 
 అటు ఇటుగా...
 జిల్లాలో కొత్తగా రెండు రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. దీంతో కొత్తగా రెండు ఆర్డీఓ పోస్టులు వచ్చాయి. దీంతో మరో రెండు కీలక పోస్టులు రావడంతో.. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ అధికారి అప్పట్లో అనివార్య పరిస్థితుల్లో ఇతర కార్యాలయానికి బదిలీ అయ్యారు. తాజాగా జిల్లాలో కొత్త పోస్టు రావడం, పరిస్థితులు అనుకూలంగా మారడంతో కొత్త పోస్టుపై కన్నెశారు. పెద్దఎత్తున పైరవీలు చేసి సీటు దక్కించుకున్నారు. మరో అధికారి ఇక్కడే ఆర్డీఓగా పనిచేస్తున్నప్పకీ.. కొత్తగా ఏర్పాటైన రెవెన్యూ డివిజన్ కీలకం కావడంతో ఆ పోస్టు కోసం పైస్థాయి నుంచి మంత్రాంగం సాగించి సీటు కైవసం చేసుకున్నారు. ఇలా సీట్లు మారుతూ ఇక్కడే తిష్టవేస్తూ కాలం గడుపుతున్నారు. జిల్లాలో కొత్త రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు అయినప్పటికీ.. కార్యాలయాలు మాత్రం వేరేచోట కొనసాగుతున్నాయి. వాస్తవంగా మల్కాజ్‌గిరి, రాజేంద్రనగర్ డివిజన్లు కొత్తగా ఏర్పాటయ్యాయి.
 
 మల్కాజ్‌గిరి డివిజన్‌కు కొత్తగా సిబ్బంది వస్తే గాని కార్యాలయం ఏర్పాటు చేసే అవకాశం లేదు. అలాగే ఇప్పుడున్న చేవెళ్ల డివిజన్ కార్యాలయాన్ని చేవెళ్ల మండల కేంద్రానికి  మార్చాల్సి ఉంది. ఇందుకు సబంధించి చేవెళ్లలో ఓ కార్యాలయాన్ని రూ.10లక్షలు ఖర్చు చేసి సిద్ధం చేశారు. అయితే అధికారులు మాత్రం అక్కడే విధులు నిర్వర్తిస్తున్నారు. దీంతో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున ్న చేవెళ్ల వాసులకు ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటైనప్పటికీ.. ఫలితం లేకుండా పోయింది. మరోవైపు చేవెళ్ల డివిజన్ సిబ్బంది కొందరు రాజేంద్రగనర్ డివిజన్‌కు మారి, కొత్తగా వచ్చే వారిని చేవెళ్ల డివిజన్‌కు పంపేందుకు భారీ ప్రయత్నాలు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement