ఏపీలో ‘కాంకర్‌’ పెట్టుబడులు | Container Corporation of India investments in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో ‘కాంకర్‌’ పెట్టుబడులు

Jan 26 2020 4:43 AM | Updated on Jan 26 2020 4:43 AM

Container Corporation of India investments in Andhra Pradesh - Sakshi

సీఎం వైఎస్‌ జగన్‌తో భేటీలో తాము పెట్టబోయే పెట్టుబడులను వివరిస్తున్న కాంకర్‌ సీఎండీ కళ్యాణ్‌రామ్‌. చిత్రంలో బందరు ఎంపీ బాలశౌరి, స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్‌ తదితరులు

సాక్షి, మచిలీపట్నం: ఏపీలో రానున్న మూడేళ్లలో రూ.5,200 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంటైనర్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా(కాంకర్‌) ముందుకొచ్చింది. ఈ మేరకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో శుక్రవారం తాడేపల్లిలోని సీఎం క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో సంస్థ చైర్మన్‌ అండ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ కళ్యాణ్‌రామ్‌ అంగీకరించారు. సమావేశం నిర్ణయాలను బందరు ఎంపీ వల్లభనేని బాలశౌరి శనివారం మీడియాకు వివరించారు. మల్టీ మోడల్‌ లాజిస్టిక్స్‌ సర్వీసెస్‌ కల్పనారంగంలో కాంకర్‌ సంస్థ అగ్రగామిగా ఉంది. కంటైనర్‌ ట్రైన్‌ సర్వీసెస్‌లో 75% మార్కెట్‌ షేర్‌తో దేశంలోనే టాప్‌ 500 కంపెనీల్లో 196వ స్థానంలో ఉంది. సంస్థ ఇప్పటికే కడపలో కంటైనర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్, విశాఖలో లాజిస్టిక్‌ వర్సిటీల ఏర్పాటుకు ముందుకొచ్చింది. తాజాగా విశాఖ పోర్టులో రూ.500 కోట్లతో, కృష్ణపట్నం పోర్టులో రూ.400 కోట్లతోనూ, కాకినాడ పోర్టులో రూ. 300 కోట్లతో మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్క్స్‌ (ఎంఎంఎల్‌పీ) ఏర్పాటు చేయనుంది. మచిలీపట్నం పోర్టు అభివృద్ధితో పాటు ఇంటిగ్రేటెడ్‌ లాజిస్టిక్‌ అండ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌జోన్‌ (ఐఎంఎల్‌జెడ్‌) ఏర్పాటుకు రూ.3వేల కోట్లు పెట్టుబడి పెట్టనుంది. 

విశాఖ– విజయనగరం మధ్య ఫ్రైట్‌ రైల్‌
రూ.వెయ్యి కోట్లతో విశాఖ–విజయ నగరం మధ్య 60 కిలోమీటర్ల మేర డెడికేటెడ్‌ ఫ్రైట్‌ రైల్‌ లైన్‌ నిర్మాణానికీ ముందుకొచ్చింది. ఇక మచిలీపట్నం పోర్టులో ఏర్పాటు చేయతలపెట్టిన ఐఎల్‌ఎంజెడ్‌ లాజిస్టిక్స్‌ సర్వీసులు, ఫ్రీ ట్రేడ్‌ వేర్‌ హౌసింగ్‌ జోన్‌ (ఎఫ్‌టీడబ్ల్యూజెడ్‌), మాన్యుఫ్యాక్చరింగ్‌ కోసం ప్రత్యేక ఆర్థిక మండలి (ఎస్‌ఈజెడ్‌), వేర్‌ హౌసింగ్, అసెంబ్లీ లైన్, వాల్యూ ఎడిషన్‌ యాక్టివిటీస్‌కు ఉపకరించనుంది. అలాగే రైల్‌ కనెక్టివిటీ, రోడ్‌ ఆపరేటర్స్‌ అండ్, షిప్పింగ్‌ లైన్‌ ఏర్పాటుతో మచిలీపట్నం ప్రాంత అభివృద్ధికి, ఇక్కడి వ్యాపారం పెరుగుదలకు, పరిశ్రమల అభివృద్ధికి ఈ ప్రాంత వాసులకు ఉద్యోగాల కల్పనకు ఎంతగానో దోహదపడనుంది. దశల వారీగా బందరు పోర్టును అభివృద్ధి చేసేందుకు ఐఎల్‌ ఎంజెడ్‌ ఉపయోగపడనుంది. ఐఎల్‌ఎంజెడ్‌ కోసం స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ (ఎస్‌పీవీ) ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు కాంకర్‌ ముందు కొచ్చింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement