నరసన్నపేట నియోజవర్గ అభివృద్ధికి అన్నివిధాలా కృషిచేస్తామంటూ సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు నీటిమూటలుగానే మారాయి.
నరసన్నపేట: నరసన్నపేట నియోజవర్గ అభివృద్ధికి అన్నివిధాలా కృషిచేస్తామంటూ సీఎం చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు నీటిమూటలుగానే మారాయి. ఆయన ఈ ప్రాం తంలో పర్యటించి నాలుగు నెలలు అవుతున్నా ఇచ్చిన హామీలు కార్యరూపం దాల్చలేదు. దీంతో వాటి అమలుపై సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఆధ్వర్యంలో నరసన్నపేటను అభివృద్ధి చేసుకుందామంటూ ఫిబ్రవరి 14 న నరసన్నపేటలో నిర్వహించిన సభలో సీఎం ప్రకటిం చారు. ఎమ్మెల్యే తెలియజేసిన సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. నిధులు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. అంతే... ఇప్పటివరకు హామీలన్నీ ప్రతిపాదనల దశల్లోనే ఉన్నాయి. అభివృద్ధి పనులకు ఒక్క రూపాయి కూడా మంజూరుకాలేదు.
సారవకోట మండలంలో బొంతు వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి 1400 ఎకరాలకు సాగునీరు అందిస్తామని, దీనికి అవసరమైన రూ.175 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ఆ రోజు ప్రకటించారు. ఇది ఆచరణకు నోచుకోలేదు.
పోలాకి మండలం సుసరాం, డీఎల్ పురం, అంప్లాంల మధ్య ఉన్న తంపర భూములను ముంపునుంచి రక్షించేందుకు శాశ్వత పరిష్కా రం చూపుతామన్నారు. దీనికి అవసరమైన ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇది అక్కడితో ఆగిపోయింది. జలుమూరు, సారవకోట మండలాల్లో 40 గ్రామాలకు తాగు నీరు అందించేందుకు శ్రీముఖలింగం వద్ద భారీ తాగునీటి పథకాన్ని ఏర్పాటు చేసి తాగునీటి కష్టాలు తీరుస్తామని హమీ ఇచ్చారు. దీనికి అవసరమైన రూ.15 కోట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించినా ఆచరణ శూన్యమే. నరసన్నపేట ప్రభుత్వాస్పత్రికి భవనాలు నిర్మిస్తామని, రోగులకు ఇబ్బందుల లేకుండా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. రూ.8 కోట్ల నాబార్డు నిధులను మంజూరు చేశారు.
రాజుల చెరువును పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని, రోడ్లు, మురికి కాల్వలను నిర్మిస్తామని సభాముఖంగా ప్రకటించారు. పనుల్లో పురోగతి లేదు. పాత జాతీయ రహదారి నుంచి వాత్సల్య ఆస్పత్రి మీదుగా శ్రీరాంనగర్ దాని పరిసర వీధులను కలుపుతూ పక్కాగా రోడ్డు నిర్మిస్తామని హమీ నిచ్చారు. ఇందిరా నగర్లో స్వర్గీయ కింజరాపు ఎర్రంన్నాయుడు పేరన పార్కు అభివృద్ధి చేస్తామన్నారు. పనులు ఆ స్థాయిలో కనిపించడంలేదు. ఇంకా ప్రతిపాదనలు దశ దాటలేదు. దీంతో సీఎం హామీలకు ఆచరణకు పొందనలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఉత్తుత్తి హామీలతో ప్రజలను మోసం చేయకుండా చేస్తామన్నదే చెప్పాలని కోరుతున్నారు.
ఉత్తుత్తి హామీలు వద్దు...
నరసన్నపేటలో అభివృద్ధి పనులు చేస్తామ ని సీఎం చంద్రబాబునాయుడే స్వయం గా హామీ ఇచ్చారు. నాలుగు నెలలు అవుతుం ది. పైసా మంజూరు కాలేదు. పనులకు అతీగతీలేదు. సీఎం హామీ అమలుకు ఇన్నిరోజులా..?. ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. పార్కు అన్నారు.. రింగు రోడ్డు అన్నారు.. కనీసం సీసీ రోడ్లు కూడా వేయడంలేదు. ఉత్తుత్తి హామీలు ఇవ్వకుండా ఆచరణ సాధ్యమైన ప్రకటనలు చేస్తే మంచిది. లేకుంటే ప్రజా విశ్వాసం కోల్పోవడం ఖాయం.
-కోరాడ చంద్ర భూషణగుప్త,
మాజీ ఉప సర్పంచ్