
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయాల్లో ఒకేసారి లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీని వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టింది. పూర్తి పారదర్శకంగా, ఎలాంటి సిఫార్సులకు తావు లేకుండా రాతపరీక్ష ఆధారంగా ఈ ఉద్యోగాలకు మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేయాలని నిర్ణయించింది. అయితే, గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ కొందరు దళారులు అభ్యర్థుల దగ్గర నుంచి వసూళ్లు ప్రారంభించినట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది.
దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని ముఖ్యమంత్రి కార్యాలయ(సీఎంవో) వర్గాలు తాజాగా స్పష్టం చేశాయి. ఆఖరికి మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఈ ఉద్యోగాలు ఇప్పించలేరని తేల్చిచెప్పాయి. సిఫార్సులకు ఆస్కారం లేకుండా మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలను భర్తీ చేయాలన్న ఉద్దేశంతో ఇంటర్వ్యూలు పెట్టలేదని వెల్లడించాయి.