వారిద్దరూ నకిలీ సమైక్యవాదులు: అంబటి | Ambati Rambabu lashes out at Kirankumar reddy, lagadapati Rajagopal | Sakshi
Sakshi News home page

వారిద్దరూ నకిలీ సమైక్యవాదులు: అంబటి

Dec 13 2013 3:02 AM | Updated on Jul 29 2019 5:28 PM

వారిద్దరూ నకిలీ సమైక్యవాదులు: అంబటి - Sakshi

వారిద్దరూ నకిలీ సమైక్యవాదులు: అంబటి

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కోటరీలోని ముఖ్యుల సూచనల మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ లగడపాటి రాజగోపాల్‌లు డ్రామా ఆడుతున్నారని, వీరిద్దరూ నకిలీ సమైక్యవాదులని వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యుడు, అధికార ప్రతినిధి అంబటి రాం బాబు ధ్వజమెత్తారు.

కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ కోటరీలోని ముఖ్యుల సూచనల మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ లగడపాటి రాజగోపాల్‌లు డ్రామా ఆడుతున్నారని, వీరిద్దరూ నకిలీ సమైక్యవాదులని వైఎస్సార్ కాంగ్రెస్ సీఈసీ సభ్యుడు, అధికార ప్రతినిధి అంబటి రాం బాబు ధ్వజమెత్తారు. ఆయన గురువారంనాడిక్కడ విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్ర విభజన విషయంలో వీరిద్దరూ  సోనియాగాంధీని, కేంద్ర ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ మాట్లాడినా అధిష్టానం వారిపై చర్యలెందుకు తీసుకోదో అందరికీ తెలుసని విమర్శించారు. సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడిన నాటి నుంచీ కిరణ్ తన పదవిని అంటిపెట్టుకుని ఫైళ్లపై సంతకాలు చేస్తూంటే ఆయన సోదరుడు వసూళ్లు చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. ‘‘విభజన నిర్ణయం వెలువడినప్పుడే కిరణ్ సీఎం పదవికి రాజీనామా చేసి ఉంటే ఈ రోజు పరిస్థితి ఇంతదాకా వచ్చేదా? అసెంబ్లీని సమావేశ పరచి సమైక్య తీర్మానం చేద్దామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నోసార్లు డిమాండ్ చేసింది. బీఏసీలో కూడా విజ్ఞప్తి చేశారు. కానీ కిరణ్ అందుకు అంగీకరించలేదు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలనే చిత్తశుద్ధే ఆయనకుంటే ఇలా చేసేవారా?’’ అని అంబటి ప్రశ్నించారు.

‘‘రూ.1,717కోట్ల విలువగల ‘ల్యాంకో ఇన్‌ఫ్రా’ కంపెనీ దీర్ఘకాలంగా బకాయి పడిన రూ.8,000 కోట్ల రుణాన్ని రీషెడ్యూల్ (వాయిదా) చేయడమే కాక తాజాగా రూ.3,500 కోట్ల రుణాన్ని ఇస్తున్నారు. లగడపాటి నిజంగా కాంగ్రెస్‌పై, కేంద్రప్రభుత్వంపై తిరుగుబాటు చేసిన వ్యక్తే అయితే జాతీయ బ్యాంకులు ఆయన కంపెనీకి ఇలా లబ్ధిని చేకూరుస్తాయా?’’ అని అంబటి విస్మయం వ్యక్తం చేశారు. తాము ఎన్జీవో నేతలతో కలిసి పెట్టబోయే పార్టీ ద్వారా రాజకీయ లబ్ధిపొంది, వచ్చే ఎన్నికల్లో సీట్లను పొంది ఆ తరువాత వాటిని సోనియా కాళ్లముందు పెట్టాలనేది కిరణ్, లగడపాటి ఆలోచనని చెప్పారు. కానీ తెలుగు ప్రజలు వీరి నాటకాలను గమనిస్తున్నారని, వారు పెట్టబోయే పార్టీకి ఒక్క ఓటు గానీ, ఒక్క సీటుగానీ రావని జోస్యం చెప్పారు. సోనియాతో జగన్ కుమ్మక్కయి ఉంటే 16 నెలలు జైల్లో ఎందుకుంటారు? కాంగ్రెస్ పెట్టించిన కేసులతో ఎందుకు వే ధింపులకు గురవుతారు? ఆయన సంస్థలపై దాడులు ఎందుకు జరుగుతాయి? అని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా ఎదురు ప్రశ్నలు వేశారు.

Advertisement
 
Advertisement
Advertisement