జిల్లాలో పైలేరియా నివారణ కార్య క్రమంలో భాగంగా 91.39 శాతం మందికి మంగళవారం డీఈసీ మాత్రలను పంపిణీ చేసినట్టు జిల్లా
91 శాతం మందికి డీఈసీ మాత్రలు పంపిణీ
Jan 29 2014 4:05 AM | Updated on Sep 2 2017 3:06 AM
నరసాపురం(రాయపేట), న్యూస్లైన్ :జిల్లాలో పైలేరియా నివారణ కార్య క్రమంలో భాగంగా 91.39 శాతం మందికి మంగళవారం డీఈసీ మాత్రలను పంపిణీ చేసినట్టు జిల్లా ఆరోగ్య విస్తరణ, మీడియా అధికారి చదలవాడ నాగేశ్వరరావు తెలిపారు. మంగళవారం నరసాపురం వచ్చిన ఆయన ‘న్యూస్లైన్’తో మాట్లాడారు. జిల్లాలో 39 లక్షల 56వేల 859 జనాభాలో రెండేళ్ల లోపు పిల్లలు, గర్భిణలు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిని మినహాయించగా, 35 లక్ష 21వేల 605 మంది డీఈసీ మాత్రలు వేసుకునేందుకు అనుకూలురని గుర్తించామన్నారు. వారిలో 32 లక్షల 18వేల 616 మందికి మాత్రలు పంపిణీ చేసినట్టు తెలిపారు. జిల్లాలో 15వేల 831 మంది వలంటీర్లు ఇంటింటికీ తిరిగి మాత్రలు పంపిణీ చేశారన్నారు. వలంటీర్లలో అంగనవాడీ, ఆశ వర్కర్లతోబాటు కళాశాలల విద్యార్థినులు ఉన్నారని చెప్పారు. డీఈసీ మాత్రలను వరుసగా అయిదారేళ్ళు తీసుకుంటే పైలేరియా దరిచేరదన్నారు.
డీఈసీ మాత్రలను తీసుకున్న తర్వాత కళ్లు తిరగడం, జ్వరం వంటి లక్షణాలు కనబడితే పైలేరియా నిర్ధారణ పరీక్షలు చేయించుకుని మందులు తీసుకోవాలని సూచించారు. కాళ్లు, శోష గ్రంధులు, నాళాల వాపు, వరిబీజం మొదలైన వాటిని వ్యాధి లక్షణాలుగా పరిగణించవచ్చన్నారు. తొలిదశలో ఇటువంటి లక్షణాలు బయటపడటం ద్వారా బోధ వ్యాధిని గుర్తించగలమని వివరించారు. పైలేరియా రోగకారక మైక్రోబ్యాక్టీరియా ఆరు నుంచి ఎనిమిదేళ్ల వరకు బయటపడదని వివరించారు. కనుక డీఈసీ మాత్రలను కనీసం అయిదేళ్లపాటు వరుసగా తీసుకోవాలని స్పష్టం చేశారు.
Advertisement


