
ఎటు వెళ్లిపోయిందో!
నానమ్మ ఇంటి నుంచి ఎందుకు బయలుదేరిందో తెలియదు. పోనీ అమ్మమ్మ ఇంటికైనా చేరిందా అంటే అదీ లేదు. మార్గమధ్యంలో ఏమైందో, ఏమిటో తెలియక ఆ 11 ఏళ్ల బాలిక కోసం
నానమ్మ ఇంటి నుంచి ఎందుకు బయలుదేరిందో తెలియదు. పోనీ అమ్మమ్మ ఇంటికైనా చేరిందా అంటే అదీ లేదు. మార్గమధ్యంలో ఏమైందో, ఏమిటో తెలియక ఆ 11 ఏళ్ల బాలిక కోసం ఆమె తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
కడియం :శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన ఉదాల ప్రకాష్, నాగమ్మ వ్యవసాయ పనులు చేసుకునేందుకు కడియం మండలం దుళ్ల గ్రామానికి పది రోజుల క్రితం వచ్చారు. వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. పెద్ద కుమార్తె దుర్గా ప్రియాంక పుట్టుకతోనే మూగ, చెవిటి. బయటకు వెళుతున్నట్టు సైగ చేసి.. మంగళవారం పలాసలోని తన నానమ్మ ఇంటి వద్ద నుంచి బయలుదేరింది. ఆమె రాజమండ్రి వైపు వెళుతున్న రైలు ఎక్కినట్టు చూసిన వారు ఆమె నానమ్మకు చెప్పారు. దీంతో ఆమె ఈ మేరకు ప్రకాష్, నాగమ్మకు సమాచారమిచ్చింది. అమ్మమ్మ ఇల్లు ఉన్న దుళ్ల గ్రామానికి ప్రియాంక వస్తున్నట్టుగా భావించి వారు రాజమండ్రి రైల్వేస్టేషన్కు వెళ్లారు.
అయితే రైల్వే స్టేషన్లో ఆమె జాడ కనిపించలేదు. ప్రియాంక ఫొటో చూపించి రైలులోని ప్రయాణికులను ఆరాతీయగా, తమకు ఆమె కనిపించినట్టు కొందరు చెప్పారు. ఈ క్రమంలో రాజమండ్రి సమీపంలోని రైల్వేస్టేషన్లలో ఆమె బంధువులు గాలించారు. సామర్లకోట రైల్వే స్టేషన్లో ఆ బాలికను చూసినట్లు అక్కడి వారు చెప్పారని తల్లిదండ్రులు పేర్కొన్నారు. మూగ, చెవిటి అయినప్పటికీ ఆమె రాసి చూపించగలదని చెప్పారు. దుళ్ల రావాలనే ఉద్దేశంతో బాలిక బయలుదేరి ఉంటుందని వారు భావిస్తున్నారు. రెండు రోజులుగా ఆమె ఇంటికి చేరకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు బుధవారం స్థానిక విలేకరులకు వివరాలు చెప్పారు. బాలిక తప్పిపోయినట్టు పలాస పోలీస్స్టేషన్లో తమ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని తండ్రి ప్రకాష్ తెలిపారు.