రింకూ సింగ్తో అనుకుల్ రాయ్ (PC: BCCI)
కోల్కతా నైట్ రైడర్స్ ఆల్రౌండర్ అనుకుల్ రాయ్కు సువర్ణావకాశం వచ్చింది. భారత్-‘ఎ’ జట్టులో అతడు చోటు దక్కించుకున్నాడు. హర్ష్ దూబే స్థానంలో శ్రీలంక, అఫ్గనిస్తాన్ ‘ఎ’ జట్లతో జరిగే త్రైపాక్షిక సిరీస్కు అనుకుల్ రాయ్ ఎంపికయ్యాడు.
హర్ష్ దూబే స్థానంలో..
ఈ విషయాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) గురువారం వెల్లడించింది. కాగా స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్ హర్ష్ దూబే ఇటీవలే టీమిండియా నుంచి పిలుపు అందుకున్న సంగతి తెలిసిందే. స్వదేశంలో అఫ్గనిస్తాన్తో జరిగే ఏకైక టెస్టు, వన్డే సిరీస్కు సెలక్టర్లు అతడిని ఎంపిక చేశారు.
కారణం ఇదే
కాగా హర్ష్ దూబే జాతీయ జట్టుకు ఎంపిక కావడం ఇదే తొలిసారి. అయితే, అఫ్గన్తో సిరీస్ కంటే ముందు ప్రకటించిన భారత జట్టులో హర్ష్ దూబేకు చోటిచ్చారు సెలక్టర్లు. తాజాగా అతడి స్థానంలో అనుకుల్ రాయ్ను ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
జార్ఖండ్కు చెందిన 27 ఏళ్ల అనుకుల్ రాయ్ స్పిన్ ఆల్రౌండర్. ఎడమచేతి వాటం గల ఈ ఆటగాడు ఐపీఎల్-2026లో కోల్కతాకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఇప్పటికి 13 మ్యాచ్లు ఆడి 43 పరుగులు చేయడంతో పాటు.. ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.
తిలక్ వర్మ సారథ్యంలో
ఇదిలా ఉంటే.. శ్రీలంకలో జరిగే వన్డే ముక్కోణపు సిరీస్లో ఆతిథ్య జట్టుతో పాటు భారత్-‘ఎ’, అఫ్గన్-‘ఎ’ జట్లు పాల్గొంటాయి. జూన్ 9- జూన్ 21 మధ్య ఈ సిరీస్ నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది. ఇందుకు డంబుల్లా వేదిక. ఇక ఈ సిరీస్లో భారత జట్టుకు హైదరాబాదీ తిలక్ వర్మ కెప్టెన్గా ఎంపిక కాగా.. చిచ్చర పిడుగు వైభవ్ సూర్యవంశీ తొలిసారిగా ‘ఎ’ జట్టులో చోటు దక్కించుకున్నాడు.
ముక్కోణపు వన్డే సిరీస్కు భారత్-‘ఎ’ జట్టు (అప్డేటెడ్)
తిలక్ వర్మ (కెప్టెన్), ప్రియాన్ష్ ఆర్య, వైభవ్ సూర్యవంశీ, రియాన్ పరాగ్ (వైస్ కెప్టెన్), ఆయుశ్ బదోని, నిశాంత్ సంధు, సూయాన్ష్ షెడ్గే, ప్రభ్సిమ్రన్ సింగ్ (వికెట్ కీపర్), కుమార్ కుశాగ్రా (వికెట్ కీపర్), విప్రాజ్ నిగమ్, యశ్ ఠాకూర్, యుధ్వీర్ సింగ్, అన్షుల్ కాంబోజ్, అర్షద్ ఖాన్, అనుకుల్ రాయ్.


