చిన్నచిన్న కారణాలకే జీవితం ముగిసిపోయినట్లుగా కుంగిపోతాం. కానీ ఈ వ్యక్తిని చూస్తే కష్టం అంటే ఇది కదా..అని అంగీకరిస్తారు. భవిష్యత్తు అనేదే అగమ్యగోచరంగా ఉన్నా..అతడు పోరాడి జీవితంలో గెలవాలనుకున్న విధం చూస్తే ..అత్యుత్తమ ప్రేరణకర్త, స్ఫూర్తిప్రదాతగా అనిపిస్తాడు. అంతేగాదు అతడిని బాధపెట్టిన విధి సైతం చేతులెత్తి నమస్కరించేలా విజయ శిఖరాన్ని అధిరోహించాడు. ఆ అద్భుతమైన వ్యక్తి ఎవరంటే..
అతడే రష్యన్ పర్వతారోహకుడు రుస్తమ్ నబీవ్. అసామాన్య ఘనతను సాధించాడు. ఎలాంటి కృత్రిమ అవయవాలు లేకుండా కేవలం చేతులతో మౌంట్ ఎవరెస్టును అధిరోహించిన తొలి డబుల్ ఆంప్యూటీగా చరిత్ర సృష్టించారు. నేపాల్లో కొనసాగుతున్న వసంతకాల పర్వతారోహణ సీజన్లో భాగంగా బుధవారం (మే 20) ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పర్వత శిఖరాన్ని అధిరోహించారు. నబీవ 2015లో తన రెండు కాళ్లను కోల్పోయిన మాజీ పారాట్రూపర్.
ఈ చారిత్రాత్మక అధిరోహణ అనంతరం నబీవ్ సోషల్ మీడియా పోస్ట్లో మౌంట్ ఎవరెస్ట్పై ఉన్న తన చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఆ చిత్రంలో ఆయన ఒక ఫలకం పట్టుకుని కనిపిస్తారు. ఆ ఫలకంపై ఇలా రాసి ఉంది. "కింద పడగానే జీవితం ముగిసిపోతుందని భావించిన వారికి ఈ సాహసం అంకితం అని ఉంది. ఆయన ఈ మే 20వ తేదీన నేపాల్ కాలమానం ప్రకారం ఉదయం 8:16 గంటలకు పర్వాతారోహణ చరత్రలోనే తొలిసారిగా, మానవ చరిత్రలోనే తొలిసారిగా చేతులతో ఎవరెస్టు శిఖరాన్ని చేరుకున్నారు.
ఆ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోకు క్యాప్షన్గా పెట్టారు. అంతేగాదు ఆ పోస్ట్లో నబీవ్ ప్రతి ఒక్కరికి ఈ అధిరోహణను అంకితం చేస్తున్నాను. ఈ సాహసంతో తాను చెప్పదలచుకున్నదేంటంటే గొంతులో ప్రాణం ఉన్నతం వరకు పోరాడండి. దయచేసి చివరి వరకు పోరాడండి. అని పేర్కోన్నాడు పోస్ట్లో. ఈమేరకు అతడి ఎవరెస్టు అధిరోహణను ఎవరెస్ట్ బేస్ క్యాంప్లోని ఫీల్డ్ ఆఫీస్ కోఆర్డినేటర్ ఖిమ్ లాల్ గౌతమ్ ధృవీకరించారు. కాగా, నబీవ్ 2015లో తను నిద్రిస్తున్న సైనిక బ్యారక్స్ భవనం కూలిపోవడంతో రెండు కాళ్లను కోల్పోయాడు.
అయితే ఆ ఘటనతో కుంగిపోకుండా కోలుకుని బహిరంగ కార్యకలాపాలు, పర్వతారోహణ కార్యకలాపాల వైపు మళ్లించి..మనిషి తలుచుకుంటే ఏదైనా సాధ్యమే అని నిరూపించాడు. నెటిజన్లు సైతం నబీవ్ అద్భుతైన ధైర్యాన్ని, పట్టుదలను ప్రశంసిస్తూ..మీరు అత్యుత్తమ ప్రేరణ కర్త, ఏదైనా సాధ్యమే అని మీ సాహసంతో గొంతెత్తి చాటారు అని పొగడ్తల వర్షం కురిపించారు.
(చదవండి: 'రోజుకు 35 సప్లిమెంట్లు తీసుకుంటా': ఆరోగ్యానికి మంచిదేనా?)


