ఈ దొంగ... ‘బంగారు’ కొండ!
కరీంనగర్లోని పీఎంజే జ్యువెలరీస్ షోరూంలో ఈ నెల మొదటి వారంలో భారీ దోపిడీకి ఒడిగట్టిన ముఠా నాయకుడు సుబోధ్ సింగ్ అలియాస్ బబువా సామాన్యుడు కాదు. గోల్డెన్ థీఫ్గా పేరున్న ఇతగాడు ఇప్పటి వరకు ఏడు రాష్ట్రాల్లో జరిగిన 400 కేజీల బంగారం చోరీ, దోపిడీ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. బీహార్లోని జైలు నుంచే పీఎంజే జ్యువెలర్స్లో దోపిడీకి స్కెచ్ చేసి, కథ నడిపంచాడు. ఈ గ్యాంగ్ను పట్టుకున్న కరీంనగర్ పోలీసులు ప్రస్తుతం సుబోధ్ను పీటీ వారెంట్పై తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. పదేళ్లల్లో ఏడు రాష్ట్రాల్లో పంజా విసిరిన ఈ సుబోధ్ సింగ్ పూర్వాపరాలు ఇవి...బీహార్లోని నాలంద జిల్లాలో ఉన్న చండి పోలీసుస్టేషన్ పరిధిలోని చిస్టిపూర్కు చెందిన ఈశ్వర్ ప్రసాద్ కుర్మి కుమారుడే సుబోధ్ సింగ్ (42). ఇతడిపై దేశంలోని ఏడు రాష్ట్రాల్లో దోపిడీ, హత్య, బందిపోటు దొంగతనం, దాడుల వంటి కేసులు నమోదయ్యాయి. పీఎంజే కేసుతో కలిపితే ఇతడిపై ఉన్న వాటి సంఖ్య 43కు చేరింది. ఫేస్బుక్ మెసెంజర్ ద్వారా సంప్రదింపులు జరుపుతూ... గూగుల్ మ్యాప్స్, ప్రత్యేక యాప్స్ వంటి అత్యాధునిక విధానాలను వినియోగిస్తూ పంజా విసిరే, విసిరించే సుబోధ్ చదివి కేవలం 12వ తరగతి.1996 వరకు ఇతగాడు బీహార్లోని వైశాలి జిల్లాకు చెందిన చిన్నచిన్న దొంగలతో కలిసి నేరాలు చేశాడు. 1999 నాటికి బీహార్ పోలీసులకు ఇన్ఫార్మర్గా మారాడు. ఆ సమయంలో ఇతడు బీహార్ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసులతో పాటు ఉన్నతాధికారులతో కూడా సంబంధాలు పెంచుకున్నాడు. 2007 వరకు తన ఇన్ఫార్మర్ పనిని కొనసాగించాడు. ఇలా సుబోధ్కు పోలీసుల పని తీరు, వ్యూహం, కదలికలు పూర్తిగా అవగతం అయ్యాయి. ఓపక్క ఇన్ఫార్మర్గా పనిచేస్తూనే... మరోపక్క తన నేర నెట్వర్క్ను పెంచుకుంటూ పోయాడు.తనకు ప్రత్యర్థులు, పోటీదారులుగా ఉన్న దొంగలు, ముఠాల సమాచారాన్ని బీహార్ పోలీసులకు అందించిన అతడు.. వాళ్లు జైలుకు వెళ్లేలా చేసి తన ‘లైన్’ క్లియర్ చేసుకున్నాడు. 2008లో ఇతగాడు కోల్కతాలోని ఎస్బీఐ బ్యాంకులో దోపిడీ చేశాడు. ఇదే ఇతడి తొలి భారీ నేరం. ఆ తర్వాత రాయపూర్లోని ఒక బ్యాంకులో కూడా పంజా విసిరాడు. ఈ కేసుల్లో మొదట కోల్కతా పోలీసులు, తరువాత రాయపూర్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2015 వరకు రాయపూర్ జైలులోనే ఉన్నాడు. బెయిల్పై విడుదలైన తర్వాత ముత్తూట్, మణప్పురం మరియు పెద్ద జువెలర్లను లక్ష్యంగా చేసుకుని సొంత గ్యాంగ్తో పంజా విసిరాడుసుభోద్ నేరచరిత్ర తొలిసారిగా 2018లో బీహార్ స్పెషల్ టాస్క్ఫోర్స్ పోలీసుల దృష్టిలోకి వచ్చింది. ప్రతి నేరాన్నీ పక్కా పథకం ప్రకారం, రెక్కీ తర్వాత చేయిస్తున్నట్లు గుర్తించారు. ప్రతి నేరంలోనూ కొత్త అనుచరుల్ని ఏర్పాటు చేసుకుని వారికి ప్రత్యేక పేర్లు, పాత్రలు కేటాయించేవాడు. ప్రతి దోపిడీలో ఈ గ్యాంగ్ 5 నుంచి 20 కిలోలకు వరకు పసిడిని కొల్లగొట్టేది. 2018 నాటికి రాజస్థాన్లోని జైపూర్, మహారాష్ట్రలోని పుణే, నాగ్పూర్, పశ్చిమ బెంగాల్లోని బరాక్పూర్లలో భారీ బంగారం దోపిడీలు చేశాడు. బీహార్లోని అనేక నగరాల్లో కూడా నేరాలు చేశాడు.2018 జనవరిలో బీహార్ స్పెషల్ టాస్క్ఫోర్స్ సుబోధ్ను అక్కడి వైశాలి జిల్లా దానాపూర్లో అరెస్ట్ చేసింది. తన ప్రేయసిని కలవడానికి వచ్చిన సమయంలో పోలీసులు పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి ఏకంగా 16.5 కిలోల బంగారం, ఒక పిస్టల్, దేశీయ తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అతడిని పాట్నాలోని బేయూర్ జైలుకు తరలించారు. చాలా కాలం ఆ జైలులోనే ఉన్నాడు. అక్కడి నుంచే తన గ్యాంగ్ సహాయంతో వరుసగా బంగారం దోపిడీలకు పథకాలు వేస్తూ, అమలు చేస్తూపోయాడు.తాను జైలులో ఉన్నప్పటికీ గ్యాంగ్ను విస్తరించాడు. సుబోధ్ సింగ్ జైలులో నుంచే కొత్త వ్యక్తులను తన గ్యాంగ్లోకి చేర్చడం ప్రారంభించాడు. స్నాచింగ్స్, దొంగతనం కేసుల్లో ఎవరైనా జైలుకు వచ్చిన వాళ్లను సుబోధ్ సింగ్ టార్గెట్ చేసుకుంటాడు. ఇలాంటి వాళ్లను అతడితో పాటు అతడి అనుచరులు బెయిల్, డబ్బు ఆశ చూపి తమవైపు తిప్పుకుంటారు ఆ వ్యక్తి అంగీకరిస్తే జైలులో నుంచే వారి బెయిల్ ఏర్పాట్లు చేయిస్తాడు. వారు బయటకు వచ్చిన తరువాత అప్పటి బయట ఉన్న తన గ్యాంగ్ సభ్యులతో వారికి శిక్షణ ఇప్పించి, బంగారం ఎక్కడ ఎలా దోచుకోవాలో నేర్పిస్తాడు.సుబోధ్ గ్యాంగ్ దోచుకున్న బంగారాన్ని నేపాల్ మరియు పశ్చిమ బెంగాల్కు తీసుకెళ్తుంది. అక్కడ దానిని కరిగించి విక్రయిస్తారు. దేశంలో జరిగిన మొత్తం బంగారం దోపిడీల్లో 70 శాతం తమ గ్యాంగ్ దేనని సుబోధ్ పోలీసులకు చెప్తూ ఉంటాడు. జైలులో ఉన్నప్పటికీ వివిధ రాష్ట్రాల్లో నేరాలకు సుబోధ్ సింగ్ పథకాలు రచిస్తాడు. అతడు పాట్నాలోని బేయూర్ జైలులో సెక్టార్–3లోని 21, 22 బ్యారక్ల్లో ఉంటాడు. అక్కడ అతడికి వీఐపీ ట్రీట్మెంట్తో పాటు అన్ని సౌకర్యాలు ఉంటాయని సమాచారం. ఈ రెండు బ్యారక్ల్లో సుబోధ్ సింగ్ గ్యాంగ్ సభ్యులు, అతడి పరిచయస్తులే ఉంటారట.2025 మార్చిలో ఒడిశాలో జరిగిన బంగారం దోపిడీ కేసులో విచారణ కోసం ఒడిశా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆపై ఈ ఏడాది ప్రథమార్థలో రాజస్థాన్కు చెందిన కంకరోలి పోలీసులు ఇతడిని ఒడిశా నుంచి పీటీ వారెంట్పై తీసకువెళ్లారు. బేయూర్ జైలులో ఉన్న సుబోధ్ రాజస్థాన్కు చెందిన సైబర్ నేరగాడు కునాల్ను బెదిరించి రూ.10 లక్షలు డిమాండ్ చేశాడు. ఆ మొత్తం చెల్లించడానికి అతడు అంగీకరించకపోవడంతో కునాల్పై హత్యాయత్నం చేయించాలని భావించాడు. కునాల్ను పోలీసులు సియాల్దా కోర్టులో హాజరు పరిచిన సమయంలో అతడిపై కాల్పులు జరిపించాలని భావించాడు. తన అనుచరులకు ఆదేశాలు ఇవ్వడం ద్బారా కునాల్పై ఉపాసన ఎక్స్ప్రెస్ రైలులో ఎస్కార్ట్ పోలీసు సమక్షంలోనే కాల్పులు జరిపించాడు. అతడు ప్రాణాలతో బయటపడగా... గార్డు గాయపడ్డాడు.2023 ఆగస్టు 23న కంకరోలిలోని భగవందాస్ మార్కెట్ ఎదురుగా ఉన్న రూపం గోల్డ్ జువెలర్స్లో దోపిడీ జరిగింది. ఉదయం 10:30 గంటలకు నాలుగు బైక్లపై వచ్చిన నేరస్తులు వ్యాపారి మరియు ఉద్యోగులను తుపాకీతో బెదిరించి బందీలుగా మార్చి సుమారు మూడు కిలోల బంగారం, రూ.18 లక్షల రూపాయల నగదు దోచుకెళ్లారు. దోపిడీదారులు ఉపయోగించిన బైక్లలో ఒకదాన్ని భిల్వారా రైల్వే స్టేషన్ సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. ఆ బైక్ బీహార్ నుంచి దొంగిలించబడినదిగా తేలింది. నిందితులు రైలులో బీహార్కు పారిపోయినట్లు విచారణలో నిర్ధారణ అయింది. ఈ కేసులో సుబోధ్ను పీటీ వారెంట్పై అరెస్టు చేశారు.ఇంతకుముందు ఇదే గ్యాంగ్ 2022 ఆగస్టు 29న ఉదయపూర్లోని సుందర్వాస్లో ఉన్న మణప్పురం గోల్డ్ లోన్ బ్రాంచ్లో జరిగిన భారీ దోపిడీలో కూడా పాల్గొన్నట్లు తేలింది. ఈ కేసులో సుబోధ్తో పాటు ముగ్గురు నేరస్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం సుబోధ్ బీహార్లోని పూర్నియా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు.– శ్రీరంగం కామేష్, క్రైమ్ రిపోర్టర్, హైదరాబాద్.