తూర్పు గోదావరిజిల్లా రామచంద్రాపురంలో సోమవారం దారుణం చోటుచేసుకుంది. కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా కత్తితో నరికి చంపేశాడో భర్త. కంప్యూటర్ శిక్షణ కోసం వెళ్లిన భార్యను ఆ సెంటర్ కు వెళ్లి మరీ పొట్టనపెట్టుకున్నాడు. కె.గంగవరానికి చెందిన వెంకటమాణిక్యాలరావుకు, అదే మండలం పామర్రుకు చెందిన సునీతకు 2009లో వివాహమైంది. వీరికి నాలుగేళ్ల కొడుకు కూడా ఉన్నాడు. ఇరువురి మధ్య గతంలో గొడవలు రావడంతో రెండేళ్ల క్రితం విడిపోయారు. గత రెండేళ్లుగా సునీత తల్లివద్దే ఉంటుంది. గొడవల నేపధ్యంలో గంగవరం పోలీస్ స్టేషన్ లోమాణిక్యాలరావుపై వరకట్న వేధింపులకింద కేసు నమోదైంది. ఏమైందోగానీ ఇవాళ ద్రాక్షారామలో కత్తికొనుగోలు చేసి, నేరుగా భార్య కంప్యూటర్ కోర్సు నేర్చుకుంటున్న సెంటర్ వద్దకు వెళ్లి ఆమె మెడపై కత్తితో నరికాడు. తీవ్రగాయాలతో రక్తస్రావమై సునీత అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. అనంతరం మాణిక్యాలరావు సమీపంలో ఉన్న పోలీస్స్టేషన్ వద్దకు వెళ్లి లొంగిపోయాడు. తన భార్య కాపురానికి రావడం లేదన్న కోపంతో ఈ అకృత్యానికి పాల్పడినట్టు నిందితుడు పోలీసులకు చెప్పాడు.
Nov 17 2014 8:16 PM | Updated on Mar 21 2024 7:48 PM
Advertisement
Advertisement
Advertisement
