చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి సన్నిధి సకల హంగులతో మహా కుంభాభిషేకానికి ముస్తాబవుతోంది.ఆలయ జీర్ణోద్ధరణ పనుల కారణంగా గత నాలుగేళ్లకు పైగా బాలాలయంలోని దారువు విగ్రహానికి పూజలు చేస్తున్న భక్తులు ఇక నుంచి మూల విరాట్ దర్శనంతో పరవశించి పోనున్నారు. ఆలయాన్ని పునరుద్ధరించి సర్వాంగ సుందరంగా తీర్చేందుకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రు.28 కోట్లు మంజూరు చేసింది.ఈనిధులతో గండి రూపు రేఖలు మారిపోయాయి.సంస్కృతి వెలిగేలా తరాలు మురిసేలా ప్రాంగణంలోకి అడుగిడగానే భక్తి భావం పెంపొందేలా ఆలయాన్ని నిర్మించారు. 2021 అక్టోబర్ 27 నుంచి మూల విరాట్ దర్శనం లేక బాలాలయంలోని దారువు విగ్రహానికి భక్తులు పూజలు చేస్తూ వచ్చారు.
వైఎస్సార్ మార్క్
గండి అభివృద్ధిలో వైఎస్ మార్క్ కనిపిస్తుంది.దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆలయాన్ని టీటీడీలో విలీనం చేయించారు.దీంతో అర్చకుల క్వార్టర్స్ భక్తుల వసతి గృహ సముదాయాలు.వీఐపీ క్వార్టర్స్,కార్యాలయం గది,పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహంతోపాటు రాయచోటి వేంపల్లె ప్రధాన రహదారి గండి పరిధి వరకు నాలుగు వరుసలతో సిమెంటు రోడ్లు వేయించారు.ఆయన మరణానంతరం ఆలయ అభివృద్ధి పడకేసింది.ఆలయం తిరిగి దేవదాయశాఖలోకి మారింది.
జగన్ ముఖ్యమంత్రి అయ్యాక
వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి,మండల ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డిలు ప్రత్యేక చొరవ చూపి గండి ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో టీటీటీలోకి మార్పించారు.మరో అరగంటలో ఆలయం టీటీడిలోకి చేరుతుందనగా హైకోర్టు స్టే అడ్డుపడింది.దీంతో జగనన్న మరో అడుగు ముందు కేసి రు.28 కోట్లు పైగా సీజీఎఫ్ నిధులు మంజూరు చేయించడంతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.పనులు ప్రారంభమయ్యాక వేంపల్లె జెడ్పీటీసి రవికుమార్ రెడ్డిలు పర్యవేక్షిస్తు వచ్చారు.అనంతరం బాలాలయం నిర్మించి అందులో దారువుతో చేయించిన స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేసి 2021 అక్టోబర్ 27 నుంచి భక్తులకు స్వామి దర్శనం చేయిస్తు వస్తున్నారు. నూతన ఆలయంలో సుమారు 120కి పైగా దేవతా మూర్తుల విగ్రహాలతో తయారు చేసిన రాతి స్థంభాలతో నిర్మించారు. రాజ గోపురాలు కూడా పలు విగ్రహాలతో అందంగా నిర్మించారు.పడమర రాజగోపురంతో పాటు కొద్ది మేర ప్రహారీ గోడ పనులు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. గోపురాలకు సంబంధించి రంగులు,తలుపులు వంటివి దాతల సహకారంతో వేయించినట్లు ఆలయ అధికారి గురుప్రసాద్ తెలిపారు.మేనెల 8నుంచి 13 వరకు కుంభాభి షేకం కార్యక్రమం నిర్వహణకు తేదీని ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు.ఈమేరకు త్వరలోనే కుంభాభి షేకానికి ఆహ్వాన పత్రికలను ముద్రించి ముఖ్యులకు అందించి ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు.
టెండర్లకు ఆహ్వానం
గండి ఆలయం జీర్ణోద్ధరణ,మహాకుంబాభిషేకం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల నిమిత్తం టెండర్లకు ఆహ్వానించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి,దేవదాయశాఖ కర్నూలు డిప్యూటి కమిషనర్ గురుప్రసాద్ తెలిపారు.చలువపందిళ్లు, విద్యుద్దీపాలంకరణ, బారికేడ్ల ఏర్పాటు,రాజగోపురాలపై కలశాలు, సారవ కొయ్యలు ,పూల అలంకరణ,యాగశాల ఏర్పాటు తదితరాలకు సంబంధించి ఈనెల 13 ఉదయం 10 గంటలకు టెండర్ల నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.


