పీలేరు రూరల్ : రైలు కింద పడి మహిళ మృతి చెందిన సంఘటన పీలేరు టౌన్ చిత్తూరు రోడ్డు మార్గం రైల్వేగేటు సమీపంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. స్థానిక చెన్నారెడ్డి కాలనీకి చెందిన గుండ్లూరు మనోహరమ్మ (65) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ధర్మవరం వెళ్తున్న నర్సాపురం ఎక్స్ప్రెస్ కిందపడి మృతి చెందింది. కదిరి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఢీకొన్న కార్లు..
తప్పిన ప్రమాదం
మదనపల్లె : మదనపల్లెలో మంగళవారం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ఓ ప్రమాదం తప్పింది. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్లో తిరుపతిరోడ్డు నుంచి పట్టణంలోకి వచ్చేందుకు సిటిఎం రోడ్డులో వస్తుండగా విద్యుత్ కేంద్రం వద్ద కాన్వాయ్లోని వాహనాలకు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న వైఎస్సార్సీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు హర్షవర్దన్రెడ్డి వస్తున్న కారు ఢీకొంది. ఇదే కారుకు వెనుక వస్తున్న నాయకులు శివారెడ్డి, పద్మజారెడ్డి కార్లు ఢీకొన్నాయి. అయితే వాటిలో ప్రయాణిస్తున్న నాయకులు ఎవరికీ ప్రమాదం జరగలేదు.


