విద్యుదాఘాతంతో కాడెడ్లు మృతి
కాశినాయన : మండలంలోని బాలాయపల్లె గ్రామానికి చెందిన రైతు నాగెళ్ల పుల్లారెడ్డి కాడెడ్లు విద్యుదాఘాతానికి గురై బుధవారం మృతి చెందాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పుల్లారెడ్డి ఉదయం 6 గంటలకు వ్యవసాయ పనుల నిమిత్తం రెండు ఎద్దులను తోలుకుని పొలానికి వెళ్లాడు. వారి బంధువైన నాగెళ్ల వెంకటేశ్వరరెడ్డి తన పొలం చుట్టు తీగను అమర్చి దానికి 11కేవీ విద్యుత్ను సరఫరా చేశాడు. పక్క పొలమే కాబట్టి ప్రమాదవశాత్తు కాడెడ్లు విద్యుత్ తీగను తగులుకుని షాక్ గురై మృతి చెందాయి. సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి వెంకటేశ్వరరెడ్డిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ యోగేంద్ర తెలిపారు. మృతి చెందిన ఎడ్లకు పశువైద్యాధికారి రామారావు పోస్టుమార్టం నిర్వహించారు. సుమారు రూ.2లక్షలకుపైగా విలువైన కాడెడ్లు మృతి చెందాయని, ప్రభుత్వం ఆదుకోవాలని నాగెళ్ల పుల్లారెడ్డి కోరుతున్నారు.
రాజంపేటలో చోరీ
రాజంపేట టౌన్ : రాజంపేట పట్టణం చత్రపతి శివాజీనగర్కు సమీపంలో ఉన్న ఓ ఇంటిలో దొంగలు పడి 45 గ్రాముల బంగారు ఎత్తుకెళ్లారని అర్బన్ పోలీసులు తెలిపారు. వివరాలిలా వున్నాయి. చత్రపతి శివాజీనగర్ ప్రాంతానికి సమీపంలో నివాసం ఉంటున్న ఎర్రప్పగారి నిర్మల పుల్లంపేట మండలం పుల్లారెడ్డిపల్లెలో ఉంటున్న తన తండ్రి ఇటీవల అనారోగ్యంబారిన పడి తిరుపతిలో చికిత్స పొందుతుండటంతో ఈనెల 14వ తేదీ తిరుపతికి వెళ్లింది. రెండు రోజుల క్రితం నిర్మల తండ్రి మృతి చెందడంతో పుల్లారెడ్డిపల్లెలో తండ్రి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండింది. అనంతరం బుధవారం ఉదయం రాజంపేటలోని తన ఇంటికి రాగా తలుపులు పగలగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా దుస్తులు, ఇతర వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో బంగారు దాచిన ప్రాంతానికి వెళ్లి చూడగా దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అర్బన్ పోలీసులు తెలిపారు.
గొర్రెల కాపరి ఆత్మహత్యాయత్నం
పెద్దతిప్పసముద్రం : మండలంలోని కాకిమారపల్లికి చెందిన జికా శ్రీనివాసులు (40) అనే గొర్రెల కాపరి ఆత్మహత్యకు యత్నించాడు. గొర్రెలు మేపేందుకు వెళ్లగా మందలోని కొన్ని గొర్రెలు కనిపించలేదని గుర్తించాడు. దీంతో మనోవేదనకు గురై గడ్డి మందు తాగాడు. కుటుంబీకులు మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆసుపత్రికి తీసుకెళ్లారు.
విద్యుదాఘాతంతో కాడెడ్లు మృతి


