అటవీ భూముల పరిరక్షణకు చర్యలు: కలెక్టర్
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో అన్యాక్రాంతమవుతున్న అటవీ భూములను పరిరక్షించేందుకు జిల్లా యంత్రాంగం అన్ని రకాల సామాజిక అంశాలను పరిగణలోనికి తీసుకుని చట్టపరంగా న్యాయబద్ధమైన చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో ప్రొద్దుటూరు అటవీ రేంజ్ పరిధిలోని రామేశ్వరం పరిధిలో అటవీ భూములను స్వాధీ నం చేసుకుని నిర్మించిన అక్రమ కట్టడాలను తొలగించే చర్యల ప్రణాళికకు సంబంధించి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ఫారెస్ట్ అధికారి వినీత్ కుమార్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు మండలం రామేశ్వరం పరిధిలోని పెన్నా పరీవాహక ప్రాంత అటవీ భూములు అన్యాక్రాంతానికి గురవుతున్నట్లు లోకాయుక్త ద్వారా అందిన నోటీసు ప్రకారం.. ఆక్రమణలో ఉన్న మొత్తం 1044 ఎకరాల అటవీ భూములను తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకునేందుకు చట్ట ప్రకారం చర్యలు తీసుకునేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. అంతకు ముందు జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్ కుమార్ జిల్లా కలెక్టర్కు వివరిస్తూ అటవీ భూముల అన్యాక్రాంతంపై ప్రభు త్వ చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, ప్రొద్దుటూరు తహశీల్దార్ గంగయ్య, ప్రొద్దుటూరు ఫారెస్ట్ రేంజ్, పోలీసు, రెవెన్యూ అనుబంధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
● కడప ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో నిర్మణంలో ఉన్న పి–4 ‘స్టార్టప్ కడప‘ సెంటర్ నిర్మాణ పనులను వేగవంతం పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టర్ ఆయా పనులను పరిశీలించారు.


