● ఓ వైపు పోరాటం.. మరోవైపు నిరీక్షణ
తెలుగు తమ్ముళ్ల చిత్తశుద్ధి ఏదీ?!
మహానాడు నిర్వహణకు సహకరించిన ఉపాధ్యాయులకు అండగా తెలుగుతమ్ముళ్లు నిలవాలి. అలాంటి చిత్తశుద్ధి వారిలో కన్పించడం లేదు. ప్రధానంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డిలు బాధ్యతగా వ్యవహరించి టీచర్ల ప్లాట్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీకీ యథావిధిగా అప్పగించాల్సి ఉంది. మహానాడు నిర్వహణకు సహకరించిన నేపథ్యంలో స్థానికంగా ఉన్న సమస్యలకు పరిష్కారం చూపి, యథావిధిగా అప్పగించాల్సి ఉండగా, ఆరు నెలలు అవుతున్నా నాన్చుడు ధోరణి వ్యక్తమౌతోంది. ఇకనైనా తెలుగుతమ్ముళ్లు టీచర్లకు న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు.
సాక్షి ప్రతినిధి, కడప: అయ్యవార్లు ఊహించిందే అయింది. గ(పె)ద్దలు బెదిరించి స్వాహా చేయాలని చూస్తున్న భూమిలో మహానాడు కోసం హద్దులు చెరిపేశారు. తిరిగి యథావిధిగా ప్లాట్స్ దక్కుతాయా? అనే సందిగ్ధం ఇప్పటికీ కొనసాగుతోంది. హౌస్ బిల్డింగ్ సొసైటీ భూమి సక్రమంగా అప్పగిస్తారా? ముప్పుతిప్పలు పెడుతారా? అనుమానాలు నిజమవుతోన్నాయి. ఆరు నెలలు అవుతున్నా టీడీపీ నేతలు సమస్యలకు పరిష్కారం చూపలేదు. నాడు సీఎం చంద్రబాబు ద్వారా ప్రశంసలు, సన్మానాలు సరే.. ‘యూజ్ అండ్ త్రో పాలసీ’ హౌస్ బిల్డింగ్ సొసైటీకి కూడా వర్తింపజేశారని అయ్యవార్లలో ఆవేదన వ్యక్తమవుతోంది.
● 1989లో టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ 88 ఎకరాలు కడప రూరల్ పబ్బాపురం గ్రామ పరిధిలో కొనుగోలు చేసింది. అందులో 1430 మంది ఉపాధ్యాయులకు ఇంటి స్థలాలు కేటాయించారు. అప్పట్లో ఆ భూమి వైపు కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. కాలక్రమేణా రింగ్రోడ్డు అందుబాటులోకి రావడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. దాదాపు 17 ఏళ్ల తర్వాత 2006లో ‘మా సమ్మతి లేకుండా కొనుగోలు చేశారు’ అని శోత్రియందారులు కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఉత్తర్వుల మేరకు 6.66 ఎకరాలు మాత్రమే శోత్రియం దారులకు అప్పగించాల్సి ఉంది.
రికార్డు లేకున్నా రిజిస్ట్రేషన్: పబ్బాపురం టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ పరిధిలో 20 ఎకరాలకు రైత్వారీ పట్టా ఒకటికి వెలుగులోకి తెచ్చారు. ఆ రైత్వారీ పట్టాకు చెందిన భూమి వెబ్ల్యాండ్ రికార్డుల్లో లేదు. అయినప్పటికీ రూరల్ సబ్రిజిస్ట్రార్ కార్యాలయం శుభకీర్తి డెవెలపర్స్ పేరిటి రిజిస్ట్రేషన్ చేసింది. ఈ మొత్తం వ్యవహారాన్ని హౌస్ బిల్డింగ్ సొసైటీ వెలుగులోకి తెచ్చింది. అప్పటి జాయింట్ కలెక్టర్ గణేష్కుమార్ జిల్లా రిజిస్ట్రార్, చింతకొమ్మదిన్నె తహసీల్దార్, టీచర్లతో కలిపి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు పరిశీలిస్తే.. 2021లో రైత్వారీ పట్టా కేటాయింపునకు చెందిన ఎలాంటి రికార్డులు అందుబాటులో లేవని స్పష్టమైంది. నకిలీ రైత్వారీ పట్టా పుట్టించినట్లు తేటతెల్లమైంది. అయితే వెబ్ల్యాండ్లో లేకపోయినా శుభకీర్తి డెవెలపర్స్కు రిజిస్ట్రేషన్ కావడం వెనుక ఓ బడా టీడీపీ నేత ఉన్నట్లు తెలుస్తోంది.
ఆరు నెలల క్రితం టీచర్స్ లేఔట్లో మహానాడు నిర్వహణ
చదును చేసి హద్దులు చెరిపేసిన టీడీపీ పెద్దలు
ఇదివరకే ఆక్రమణకు సిద్ధమైన అక్రమార్కులు
35 ఏళ్లుగా ఎదుగుబొదుగు లేకుండా ఉండిపోయిన ప్లాట్స్
యథావిధిగా స్థలాలు దక్కుతాయా?నాడు అయ్యవార్లు హైరానా
సమస్యలు పరిష్కరించిప్లాట్స్ కేటాయిస్తామని హామీ
తర్వాత పట్టించుకోని నాయకులు
టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కొనుగోలు చేసిన భూమిని చేజిక్కించుకోవాలని కొందరు అక్రమార్కులు విశ్వప్రయత్నం చేస్తున్నారు. నకిలీ డాక్యుమెంట్లుతో దౌర్జన్యం చేస్తున్నారు. ఇది వరకూ అనేక పర్యాయాలు ఉన్నతాధికారుల దృష్టికి అయ్యవార్లు తీసుకెళ్లారు. అధికారులు సానుకూలంగా స్పందించినా టీచర్లుకు దశాబ్దాల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. అవే స్థలాలపై తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తుండటంతో వ్యవహారం మరింత జఠిలమైంది. అప్పటి వరకూ ఉన్న టీచర్స్ ప్లాట్స్ రాళ్లు, హద్దులు చెరిపేశారు. యథావిధిగా టీచర్స్ ప్లాట్స్ అప్పగిస్తామని టీడీపీ ఎమ్మెల్యేలతోపాటు జిల్లా కలెక్టర్ వరకూ అందరూ హామీ ఇచ్చారు. టీచర్లు సొంత డబ్బుతో కొనుగోలు చేసిన స్థలాన్ని ఇప్పటికీ దక్కించుకోలేని దుస్థితి నెలకొంది. అయ్యవార్లకు ఓ వైపు పోరాటం, మరోవైపు సమస్యలు పరిష్కారం కాక నిరీక్షణ తప్పడం లేదు.
● ఓ వైపు పోరాటం.. మరోవైపు నిరీక్షణ
● ఓ వైపు పోరాటం.. మరోవైపు నిరీక్షణ
● ఓ వైపు పోరాటం.. మరోవైపు నిరీక్షణ


