
ప్రణాళిక ప్రకారమే సీజేఐపై దాడి
భారత రాజ్యాంగాన్ని కాలరాసేందుకు కుట్ర
సదస్సులో పాల్గొన్న ప్రజా సంఘాల నాయకులు, ప్రజలు
మాట్లాడుతున్న హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి చంద్ర కుమార్
కడప కార్పొరేషన్ : న్యాయవ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవడానికి పక్కా ప్రణాళిక ప్రకారమే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై మతోన్మాదులు దాడి చేశారని హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్ ఆరోపించారు. ఆదివారం పాతరిమ్స్ ప్రాంగణంలోని బీసీ భవన్లో కడప పౌర సమాజం ఆధ్వర్యంలో ‘సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై దాడిని ఖండిద్దాం– రాజ్యాంగాన్ని కాపాడుకుందాం’ పేరుతో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. భారత రాజ్యాంగ మూల స్తంభాలపై జరిగిన దాడిగా దీన్ని చూడాల్సిన అవసరం ఉందన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత పౌర సమాజంపై ఉందన్నారు. పెద్ద కుట్రలో భాగంగానే సీజేఐపై ఈ దాడి జరిగిందన్నారు. మనువాదాన్ని, మతోన్మాదాన్ని రెచ్చగొట్టి మళ్లీ అధికారంలోకి రావాలని చూస్తున్నారన్నారు. దేశంలో జరుగుతున్న అవినీతి, దోపిడీ, రైతులు, నిరుద్యోగులు పడుతున్న ఇబ్బందుల నుంచి పక్కదోవ పట్టించడానికి ఇలాంటివి చేస్తున్నారన్నారు. దేశంలో అత్యున్నత స్థానంలో ఉన్న వ్యక్తిపై దాడి చేశారంటే.. మన సమాజంలో కులతత్వం, మతతత్వం ఎంత లోతుగా పాతుకుపోయిందో, ఇది ఎంత ప్రమాదకర సంఘటనో తెలియజేస్తుందన్నారు. జ్ఞానానికి కులం లేదని, సమానత్వమే ప్రధాన ధర్మమని రాజ్యాంగం చెప్పిందన్నారు. మూఢ నమ్మకాలు, కులవ్యవస్థకు వ్యతిరేకంగా అన్నమయ్య, వివేకానందుడు, వేమన, వీరబ్రహ్మంలాంటి వారు ఆనాడే గళం విప్పారని గుర్తు చేశారు.
సనాతన ధర్మ ముసుగులో దాష్టీకాలు
సనాతన ధర్మం ముగుసులో జరుగుతున్న దాష్టీకాలపై ప్రజలను చైతన్య పరచడానికి ఈ సదస్సు నిర్వహిస్తున్నామని ప్రముఖ న్యాయవాది ఏ.సంపత్ కుమార్ అన్నారు. రాజ్యాంగాన్ని పరిరక్షించే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపైనే దాడి చేయడం ద్వారా దేశంలో ఒక భయానక పరిస్థితిని కల్పించారన్నారు.
ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదం
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బీఆర్ గవాయ్పై జరిగిన దాడి ప్రజాస్వామ్య మనుగడకు ఎంతో ప్రమాదకరమని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అన్నారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకు దేవుడే తనతో ఈ దాడి చేయించారని రాకేష్ కిషోర్ చెప్పడం దారుణమన్నారు. ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ శక్తుల హింసా రాజకీయాలకు ఇది పరాకాష్ట అన్నారు.
భారత రాజ్యాంగాన్ని కాలరాసి, మతోన్మాదాన్ని, కులోన్మాదాన్ని ప్రేరేపించేందుకు కుట్ర జరుగుతోందని సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన ప్రధాని నరేంద్రమోదీ ఏకతా వాదాన్ని తెరపైకి తెస్తూ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తానని చెప్పడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు రాఘవరెడ్డి, బీఎస్పీ నాయకులు సగిలి గుర్రప్ప, డాక్టర్ మల్లేల భాస్కర్, సీపీఐ, సీపీఎం నగర కార్యదర్శులు వెంకట శివ, రామ్మోహన్, రఘునాథరెడ్డి, సాహితీ స్రవంతి రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.కుమారస్వామి, ఎన్జీవో నాయకులు రాజశేఖర్, శ్రీనివాసులు, ప్రజా సంఘాల నాయకులు అవ్వారు మల్లికార్జున, కేవీ రమణ, విశ్వనాథ్, లక్ష్మిరాజ, సంగటి మనోహర్, డీఎం ఓబులేసు, కె. శ్రీనివాసులరెడ్డి, సుబ్రమణ్యం, జేవీ రమణ, నాగసుబ్బారెడ్డి, మనోహర్ తదితరులు పాల్గొన్నారు.
మతోన్మాదాన్ని రెచ్చగొట్టి
మళ్లీ అధికారంలోకి
రావాలనుకుంటున్నారు
రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత పౌర సమాజంపై ఉంది
హైకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్ర కుమార్

ప్రణాళిక ప్రకారమే సీజేఐపై దాడి