
● అభద్రతాభావం సృష్టించేందుకు...
సాక్షి ప్రతినిధి, కడప: ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు సృష్టించడంలో టీడీపీ నేతలకు మరెవ్వరూ సాటిరారు. తాజాగా కడప కార్పొరేషన్లోనూ ఇదే పద్ధతి అవలంబిస్తున్నారు. రాజకీయ అలజడితో లబ్ధి పొందాలనే కొత్త కుట్రలకు తెరతీశారు. తమ్ముళ్ల ఎత్తుగడలకు ఎల్లో మీడియా వంతపాడుతోంది. కడప మేయర్ వ్యవహారం ఉన్నత న్యాయస్థానంలో వ్యవహారం నడుస్తోంది. కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఎమ్మెల్యేకు హైకోర్టు ఉత్తర్వులున్నాయి. ఇప్పటికిప్పుడే కోర్టులో వ్యవహారం తేలిపోయే అవకాశం లేదు. అయినప్పటికీ మేయర్ ఎన్నిక, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు మధ్య బహుముఖ పోటీ అంటూ తెలుగుతమ్ముళ్లు మైండ్గేమ్ ఆడుతున్నారు.
● కడప మేయర్ సురేష్బాబుపై ప్రభుత్వం అనర్హత వేటు వేసింది. డిప్యూటీ మేయర్ ముంతాజ్బేగంకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వం అనర్హత చర్యలపై మాజీ మేయర్ సురేష్బాబు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఈనెల 7కు వాయిదా వేస్తూ, ఆ రోజు కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాల్సిందిగా ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఫిర్యాదుదారు కడప ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేశారు. కౌంటర్ దాఖలైన తర్వాత ఇరుపక్షాల వాదనల అనంతరం ఫైనల్ తీర్పు వెలువడనుంది. ఈతతంగం ముగిసేంత వర కూ మేయర్ ఎన్నిక ఉత్పన్నమయ్యే అవకాశమే లేదు. ఇదిలాఉంటే... వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల మధ్య అలజడి లేపేందుకు తెలుగుదేశం పార్టీ నేతలు కుయుక్తులు పన్నుతున్నారు. కడప మేయర్ సీటు కోసం వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల మధ్య బహు ముఖ పోటీ అంటూ పచ్చ నేతలు తానా అంటుంటే.. ఆ రెండు పత్రికలు తందాన అంటూ వంత పాడుతున్నాయి.
అలజడి సృష్టించి లబ్దిపొందేందుకే...
‘అదిగో పులి అంటే ఇదిగో తోక’అన్నట్లుగా టీడీపీ నేత లు, ఎల్లోమీడియా వైఖరి ఉందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు పేర్లు వారే ప్రకటించడం, వారే ప్రచారం చేయడం ఒకదాని వెంట ఒకటి తెరపైకి వస్తున్నాయి. కడప కార్పొరేషన్లో 50 మంది కార్పొరేటర్లు ఉండగా, ఒక్కరు మాత్రమే టీడీపీ కార్పొరేటర్. వైఎస్సార్సీపీ నుంచి గెలుపొందిన వారిలో 8మంది టీడీపీ కండువా కప్పుకున్నారు. ఇద్దరు కార్పొరేటర్లు మరణించారు. 39మంది కార్పొరేటర్లు ఇప్పటికీ వైఎస్సార్సీపీకి ఉన్నారు. ఒకవేళ మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ వస్తే కార్పొరేటర్లందరితో మాట్లాడి తమ పార్టీ నాయకత్వం సంయుక్తంగా నిర్ణయం తీసుకుంటుందని ఆపార్టీ సీనియర్ నేతలు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికీ పార్టీలో ఉన్న కార్పొరేటర్లు సైతం అధిష్టానానికి విధేయులు. అలాంటి పరిస్థితే వస్తే వారంతా ఏకాభిప్రాయానికి వస్తారని విశ్లేషకులు వెల్లడిస్తున్నా రు. అందుకు జెడ్పీ చైర్మన్ ఎన్నికను ఉదాహరణగా చెబుతుండడం విశేషం. మేయర్ ఎన్నికలు ఇప్పుడిప్పుడే లేకపోయినప్పటికీ వైఎస్సార్సీపీ బీసీ కార్పోరేటర్లు మధ్య పోటీ అన్నట్లుగా ప్రచారం ఎత్తుకోవడంపై పలువురు అభ్యంతరం చెబుతున్నారు.
మేయర్ సురేష్బాబుపై అనర్హత వేటు పడగానే, డిప్యూటీ మేయర్గా ఉన్న ముస్లిం మైనార్టీకి చెందిన ముంతాజ్బేగంకు ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఈసందర్భంగా ఇకపై ముస్లిం మైనార్టీకి చెందిన మహిళ కడప కార్పొరేషన్ మేయర్గా పాలించనున్నట్లు టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి కూడా ప్రకటించారు. ముంతాజ్ బేగం బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికి వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ముఖ్యనేతలంతా సంయుక్తంగా హాజరయ్యారు. ఇదిలా ఉంటే ఇన్చార్జ్ మేయర్లో అభద్రతాభావం సృష్టించేందుకు కూడా మేయర్ ఎన్నికకు వైఎస్సార్సీపీ వారే పోటీ పడుతున్నారని ప్రచారం చేస్తున్నట్లుగా పరిశీలకులు భావిస్తున్నారు. వాస్తవంగా ఇన్ఛార్జి మేయర్ ముంతాజ్బేగం ప్రసన్నం కోసం టీడీపీ నేతలు ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ బలోపేతం చేసేందుకు తమ కుటుంబం కట్టుబడి ఉంటుందని ఆమె ప్రకటించడంతో టీడీపీ నేతలు తోకముడిచారు. తిరిగి మేయర్ ఎన్నికంటూ దుష్ప్రచారం చేసి.. ఇన్చార్జ్ మేయర్లో అభద్రతాభావం కల్పిస్తే రాజకీయంగా లబ్ది పొందవచ్చుననే దురాలోచన కూడా తెలుగుతమ్ముళ్లకు ఉన్నట్లు పలువురు స్పష్టం చేస్తున్నారు.

● అభద్రతాభావం సృష్టించేందుకు...