
తప్పు మీద తప్పు!
బందారుపల్లె సాకు చూపెట్టి...
సాక్షి ప్రతినిధి, కడప: సోమశిల బ్యాక్ వాటర్ ముంపు పరిహారం చెల్లింపులో అధికారులు తప్పు మీద తప్పు చేస్తున్నారు. అవార్డు అయిన తర్వాత కూడా పరిహారం చెల్లించడం ఒక ఎత్తయితే, అక్రమంగా పొందిన పరిహారానికి వడ్డీ చెల్లించాలని నిర్ణయించడం మరో ఎత్తు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సిఫార్సులతో తప్పులను సైతం అడ్డుకోలేక చేష్టలుడిగి జిల్లా స్థాయి అధికారులు ఉండిపోయారు. మరోవైపు అత్యున్నత స్థాయి అధికారి సిఫార్సులు తోడు అవడంతో రూ.1.75కోట్లు అక్రమంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు సన్నహాలు పూర్తి అయ్యాయి.
● సోమశిల బ్యాక్ వాటర్ 14వ రీచ్లో అట్లూరు మండలం చెర్లోపల్లె గ్రామంలో 254 ఇళ్లుకు ముంపు పరిహారం లభించింది. 6700 చదరపు మీటర్లు ఇళ్లున్నాయని గుర్తించి రూ.1.17 కోట్లు చెల్లించారు. అవార్డు అయిన తర్వాత వ్యవసాయ పొలంలో అవసరాలకు నిర్మించుకున్న నాలుగు ఇళ్లుకు పరిహారం చెల్లించాలని విన్నపం తెరపైకి వచ్చింది. అప్పట్లో మాజీ మంత్రి వీరారెడ్డి సిఫార్సులతో ఆ నాలుగు ఇళ్లుకు రూ.84లక్షల పరిహారం చెల్లించారు. అంతటితో ఆగకుండా తర్వాత మరో కొత్త కథ తెరపైకి తెచ్చారు. హైకోర్టు రిట్ ఫిటిషన్ 282/2010 ప్రకారం ఇచ్చిన తీర్పు మేరకు తమకు వడ్డి చెల్లించాలంటూ తాజాగా తెరపైకి తెచ్చారు. అందుకు అధికార పార్టీకి చెందిన నోరున్న ఎమ్మెల్యే తోడయ్యారు. రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిఫల్ సెక్రెటరీ సానుకూలత లభించింది. ఎవరి వాటా వారికి అప్పగించేందుకు ముందుకు రావడంతో వడ్డీ రూపేనా రూ.1.75కోట్లు సొమ్ము చేసుకునేందుకు సన్నహాలు దాదాపు పూర్తి అయ్యాయని సమాచారం.
సోమశిల బ్యాక్ వాటర్
అవార్డు అయిన తర్వాత ముంపు పరిహారం
ఆపై వడ్డీ చెల్లించాలని మరో విన్నపం
ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయిలో సిఫార్సులు
రూ.1.75 కోట్లు అక్రమంగా కొట్టేసేందుకు వేగంగా అడుగులు
అధికారపార్టీ ఎమ్మెల్యే ఒత్తిడితో చేష్టలుడిగిన అధికారులు
చెర్లోపల్లిలో అక్రమంగా ప్రజాధనం కొట్టేసేందుకు పన్నాగం
ఒంటిమిట్ట మండలం బందారుపల్లెలో అవార్డు అయిన తర్వాత డబ్బులు చెల్లించలేదు. దాంతో రద్దు కావడంతో తిరిగి అవార్డు చేశారు. రెండేళ్లు కాలం గడిచిపోవడంతో ఆ గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు చెల్లిస్తున్న పరిహారానికి వడ్డీ కూడా జమ కట్టాలని కోరారు. ఆమేరకు హైకోర్టులో రిట్ ఫిటిషన్ 282/2010 దాఖలయ్యింది. విచారించిన హైకోర్టు రెండేళ్లు ఆలస్యంగా డబ్బులు ఇచ్చిన కారణంగా వారికి వడ్డీ చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఆ సాకు చూపెట్టి అట్లూరు మండలం చెర్లోపల్లెలో వడ్డీ పేరుతో ప్రజాధనం కొల్లగొట్టేందుకు సన్నహాలు చేశారు. అంతే కాకుండా కొత్త రేట్లు ప్రకారం పరిహారం ఇస్తే వడ్డీ చెల్లించరాదని ఉత్తర్వులు సైతం ఉన్నాయి. కొత్త రేట్లు ప్రకారం పరిహారం పొందినప్పటికీ తిరిగి వడ్డీ చెల్లించాలంటూ సిఫార్సులు ఆరంభించి దాదాపు సక్సెస్ అయ్యారని తెలుస్తోంది. ఒకమారు అవార్డు అయిన గ్రామంలో తిరిగి ఇళ్లు నిర్మించి పరిహారం కొత్త రేట్లుతో పొందారు. రూ.84లక్షలు 2014లో పరిహారం పొందిన నేపధ్యంలో 1996 నుంచి 2013 వరకూ వడ్డీ చెల్లించాలని సిఫార్సులు చేపట్టారు. అధికారులు తప్పు మీద తప్పుకు ఆస్కారం ఇస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గడం, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి సిఫార్సులు చేయడంతో ప్రజాధనం దుర్వినియోగం కానుంది. అక్రమార్కులు ముంపు పరిహారం పొందడంలో అడ్డదారులతో సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం.

తప్పు మీద తప్పు!