
ప్రజా ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం
ఎస్పీ ఈజీ అశోక్ కుమార్
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించే ఫిర్యాదులు పునరావృత్తం కాకుండా క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం(పీజీఆర్ఎస్) నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 121 మంది ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ ముఖాముఖి మాట్లాడి.. చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వరం పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఆ ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు, పూర్తి వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి అందజేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ ఇ.బాలస్వామిరెడ్డి, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం తదితరులు పాల్గొన్నారు.