
మహిళ అదృశ్యం
ముద్దనూరు : మండలంలోని ఆకుతోటపల్లె గ్రామానికి చెందిన దేనేపల్లె అంకాలమ్మ (32)కనిపించకపోవడంతో సోమవారం పోలీసులు అదృశ్యం కేసు నమోదు చేశారు. సీఐ దస్తగిరి సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అంకాలమ్మకు ఆంజనేయులు అనే వ్యక్తితో సుమారు 15 సంవత్సరాల క్రితం వివాహమైంది. గత కొద్ది కాలం నుంచి ఆమె పులివెందులలోని కుట్టు శిక్షణకు వెళ్తోంది. రోజూ మాదిరిగానే ఈనెల 9వ తేదీన ఉదయం కుట్టు శిక్షణకు అని చెప్పి ఇంటి నుంచి బయలుదేరి వెళ్లింది. తిరిగి ఇంటికి రాలేదు. బంధువులను, తెలిసిన వారిని విచారించినా ఆమె ఆచూకీ లభించలేదు. సోమవారం అంకాలమ్మ సోదరుడు నల్లబల్లె వీరాంజినేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
మైలవరం : మండల పరిధిలోని ధన్నవాడ గ్రామానికి చెందిన పెద్ద పాపిరెడ్డి అనే రైతు అప్పుల బాధ తాళలేక పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకొంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ధన్నవాడ గ్రామానికి చెందిన పాపిరెడ్డి 10 ఎకరాల భూమిని సాగు చేస్తుండగా.. అందులో మిరప పంట వేసి నష్టాలు వచ్చాయి. అదే విధంగా ఆయనకు అనారోగ్య రీత్యా కూడా హాస్పిటల్లకు చాలా డబ్బులు ఖర్చు అయ్యాయి. దీంతో పంటలకు సరియైన గిట్టుబాటు ధరలు లేక అప్పులు ఎక్కువ కావడంతో మండల పరిధిలోని దొమ్మరనంద్యాల రెవెన్యూ పరిధిలో ఉన్న ప్లాట్లలో ఆత్మహత్య చేసుకున్నాడు. బంధువులు ఎంత సేపటికి ఫోన్ చేస్తున్నా తీయక పోవడంతో.. ఉదయం వాకింగ్ వెళ్లిన ప్రదేశాల్లో బంధువులు గాలించడముతో మృతి చెందిన పాపిరెడ్డి కనిపించాడు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం రావడంతో ఎస్ఐ శ్యాం సుందర్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకోని మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దుర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.
మార్చురీలో గుర్తు తెలియని మృతదేహం
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జిల్లా ఆస్పత్రిలో ని మార్చురీలో అనారోగ్యంతో మృతి చెందిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని భద్రపరిచారు. మృతుడికి 38 ఏళ్లు ఉంటాయని ఆస్పత్రి అధికారులు తెలిపారు. అతను ఈ నెల 7న అనా రోగ్యంతో ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రి సిబ్బంది ఎంఎం–3 వార్డులో ఉంచి అతనికి చికిత్స అందిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో సోమవారం మృతి చెందాడు. మృతుడికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆస్పత్రిలోని ఔట్పోస్టు అధికారులను సంప్రదించాలని మార్చురీ ఇన్చార్జి వరాలు తెలిపారు.
20న బ్యాడ్మింటన్ ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఉమ్మడి కడప జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలను ఈ నెల 20వ తేదీన పులివెందులలోని వైయస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ సంఘ అధ్యక్ష,కార్యదర్శులు డాక్టర్ సింగం భాస్కర్రెడ్డి, పి.శ్రీనివాసరెడ్డి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ 19 బాల బాలికలకు, అలాగే సీనియర్స్ విభాగంలో ఈ పోటీలను నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. సింగిల్స్, డబుల్ విభాగంలో విడివిడిగా పోటీలను నిర్వహించి జిల్లా జట్టును ఎంపిక చేస్తామన్నారు. అండర్ 19 విభాగంలో పాల్గొనదలచు క్రీడాకారులు 2007 జనవరి 1న తరువాత జన్మించిన వారై ఉండాలన్నారు. సీనియర్స్ విభాగంలో ఎవరైనా పాల్గొనవచ్చన్నారు. క్రీడాకారులు తమ ఎంట్రీలను ఈనెల 18వ తేదీ సాయంత్రం లోపు చేసుకోవాలన్నారు. డబుల్ విభాగంలో పార్ట్నర్ పేరు తప్పనిసరి అని పేర్కొన్నారు. ఈ పోటీలలో పాల్గొనదలచు క్రీడాకారులు ఆదివారం ఉదయం తొమ్మిది గంటల లోపు హాజరు కావలసి ఉంటుందన్నారు. వివరాలకు 9440107080, 9440223908 నంబర్లకు సంప్రదించాలని వివరించారు.

మహిళ అదృశ్యం

మహిళ అదృశ్యం