
ఆరోగ్య యోగం.. ఆనంద భాగ్యం
కడప ఎడ్యుకేషన్ : యోగాతో ఆరోగ్యం సిద్ధిస్తుందని, తద్వారా ఆనంద భాగ్యం లభిస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా ఆదివారం కడప వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో కడప నగరపాలక, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఫ్యామిలీ యోగా’కు విశేష స్పందన లభించింది. ఈ కార్యక్రమంలో సుమారు 1000 కుటుంబాలకు చెందిన 4,365 మందికి మాస్టర్ ట్రైనర్లు యోగాసనాలపై అవగాహన, శిక్షణ ఇచ్చారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై యోగాసనాలు వేసి జిల్లా ప్రజలకు స్ఫూర్తిగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఫ్యామిలీ యోగా కార్యక్రమానికి ఒక్కో కుటుంబానికి చెందిన పిల్లలు, తల్లిదండ్రులు, గ్రాండ్ పేరెంట్స్ మొదలైన మూడు కేటగిరీలకు చెందిన 4,365 మంది హాజరై యోగాసనాలు వేయడం.. గర్వించదగ్గ విషయం అన్నారు. ఇంటిల్లిపాదికీ మన దినచర్యలో యోగా ఒక భాగం కావాలని పేర్కొన్నారు. ‘యోగాంధ్ర క్యాంపెన్ –2025’ మాసోత్సవాలు మే 21 నుంచి జూన్ 21 వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కడప మునిసిపల్ కమిషనర్ మనోజ్ కుమార్ రెడ్డి, కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, జిల్లా పర్యాటక అధికారి సురేష్ కుమార్, స్టెప్ సీఈఓ సాయిగ్రేస్, డీఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ రాజలక్ష్మి, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రంగస్వామి, డీఎమ్హెచ్ఓ నాగరాజు, డీఎస్డీఓ జగన్నాథరెడ్డి, ఆయుష్ నోడల్ అధికారి మురళి తదితర జిల్లా అధికారులు, కుటుంబ సభ్యులు, విద్యార్థులు, పలువురు ఉద్యోగులు, ఎన్జీవో ప్రతినిధులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
‘ఫ్యామిలీ యోగా‘కార్యక్రమానికి విశేష స్పందన
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి

ఆరోగ్య యోగం.. ఆనంద భాగ్యం