
5న కలెక్టరేట్ ఎదుట ఆందోళన
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న శానిటేషన్ (ఆయా) వర్కర్లకు 3 నెలలు పెండింగ్ వేతనాలు చెల్లించి సామాజిక భద్రతా చట్టంలో భాగంగా పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించి కనీస వేతనాలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 5న కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టనున్నట్లు ఏఐటియూసీ జిల్లా డిప్యూటీ జనరల్ సెక్రటరి కేసీ బాదుల్లా తెలిపారు.సోమవారం నగరంలోని హోచిమిన్ భవన్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 300 మంది విద్యార్థులకు ఒక ఆయా ఉండటం వల్ల ఆయాలపైన విపరీతమైన పనిభారం పెరిగిందన్నారు. 50 మంది విద్యార్థులకు ఒక ఆయాను నియమించాలని కోరారు. పాఠశాలలను, కళాశాలలను పరిశుభ్రంగా ఉంచే శానిటేషన్ (ఆయా) వర్కర్లు అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి ఉద్దే మద్దిలేటి, ఆయాలు కుమారి, నాగలక్ష్మి, వెంకటేశ్వరి పాల్గొన్నారు.