
పంటల సాగుపై రైతులకుఅవగాహన
సిద్దవటం: రైతుసేవా కేంద్రాల్లో ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ప్రతి రైతు రైతు సేవా కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి నాగేశ్వరరావు తెలిపారు.సిద్దవటంలోని ఎంపీడీఓ కార్యాలయ సభా భవనంలో సోమవారం వికసిత్ కృషి సంకల్ప అభియాన్ పథకంపై రైతులకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నదాత సుఖీభవ ప్రతి రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, పీఎం కిసాన్ పథకంపై రైతులు అవగాహన కలిగి ఉండాలన్నారు. వరి, సజ్జ, చిరుధాన్యాల సాగు, మహాత్మా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద ఉద్యాన పంటలు సాగు, విస్తీర్ణం పెంపు, ప్రకృతి వ్యవసాయ విధానాల వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించామన్నారు. ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త వీరయ్య మాట్లాడుతూ వరిలో పచ్చిరొట్ట ఎరువుల పంట పూత దశలో ఉన్నపుడు కలియదున్నాలని, 2 కిలో లు సూపర్ వేసి దున్నితే త్వరగా కుళ్లుతుందన్నారు. విత్తనశుద్ధిని తప్పనిసరిగా చేసుకోవాలన్నారు. ఉధ్యానాధికారి జయభరత్రెడ్డి మాట్లాడుతూ మామిడిలో జూన్, జూలైలో ముదురు కొమ్మలను కత్తిరించు కోవాలన్నారు. కార్యక్రమంలో ఐసీఏఆర్ శాస్త్రవేత్త ఖురేషి, శాస్త్రవేత్త మానస, జిల్లా వనరుల కేంద్రం ఏఓ పద్మజ, రైతులు పాల్గొన్నారు.