
టీడీపీ..మహా కవ్వింపు !
● రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలి
సాక్షి ప్రతినిధి, కడప : మహానాడు సందర్భంగా కడపలో టీడీపీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలతో పాటు, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, దేశ చిహ్నమైన అశోక చక్రాన్ని కూడా అవమానిస్తున్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రచార పిచ్చి అందరి మనోభావాలు దెబ్బతినేలా చేస్తోంది. ప్రతి సర్కిల్లో పసుపు జెండాలు కట్టి అన్ని వర్గాలనూ రెచ్చగొట్టే పనిలో పడింది. నేటి నుంచి మూడు రోజుల పాటు కడపలో చేపట్టనున్న మహానాడు కోసం నగరంలో ప్రతి చోటా ఫ్లెక్సీలు, జెండాలతో నింపేస్తున్న టీడీపీ నేతలు, మహనీయులను కూడా అవమానపరుస్తున్నారు.
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అడ్డాలో మేం జెండా ఎగురవేశాం అని చెప్పుకునేందుకు టీడీపీ నానా తంటాలు పడుతోంది. గత ఎన్నికల్లో ఎలాగోలా గట్టెక్కినా టీడీపీ, ఇప్పుడు తామేదో గొప్ప విజయం సాధించినట్లు కడపలో మహానాడు నిర్వహించుకుంటోంది. అంతవరకూ సరే అనుకున్నా, దీని కోసం ప్రత్యర్థి పార్టీలను, వివిధ వర్గాలను రెచ్చగొట్టే చర్యలకు దిగడం సమస్యాత్మకంగా మారుతోంది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రచార పిచ్చి మహనీయులను సైతం అవమానపరిచే స్థాయికి వెళ్లింది. నగరంలోని అలంఖాన్పల్లి సర్కిల్, కృష్ణాపురం సర్కిళ్లలో దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలకు కూడా పసుపు జెండాలు కట్టడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.
మహనీయుడికి పసుపుతోరణం
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్నీ అవమానించడంపై అంబేద్కర్ వాదులంతా మండిపడుతున్నారు. కడపలో ఎమ్మెల్యే ప్రచార ఆర్భాటంలో మహనీయులను అవమానపరచడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కడప నగరంలోకి అంబేద్కర్ విగ్రహం చుట్టూ టీడీపీ జెండాలు కట్టడం ఇప్పుడు ఆయన అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ తీరును నిరసిస్తూ నేలపై కూర్చుని మాలమహానాడు నేతలు నిరసన తెలిపారు. మహాత్మగాంధీ, ప్రకాశం పంతులు, సైనిక్ సర్కిల్, అన్నమయ్య విగ్రహం ఇలా అన్నీ విగ్రహాలను పసువుమయం చేశారు. అన్ని వర్గాల మనోభావాలు దెబ్బతింటున్నా పట్టించుకోని అధికారులు.. పైగా మహానాడు సేవలో మునిగి తేలుతుండడం గమనార్హం.
ఎవరి పార్టీపై వారికి అభిమానం ఉండటం సహజమే. హద్దులు దాటి పక్కవారిని రెచ్చ గొట్టేలా ప్రయత్నించడం సరైంది కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి కవ్వింపు చర్యలు మంచిది కాదని హితవు పలుకుతున్నారు. ఇదిలా ఉంటే నిత్యం మహానాడు పనులను పర్యవేక్షిస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగం ఇలాంటి చర్యలను ఎలా సమర్థ్ధిస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఒక్క వైఎస్సార్ విగ్రహమే కాదు... చివరికి దేశ చిహ్నమైన అశోకచక్రంతో కూడిన వై జంక్ష న్ సర్కిల్ను కూడా పసుపు జెండాలతో కప్పేయడం గమనార్హం. అలాగే మరో అడుగు ముందుకు వేసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పసుపు మయం చేసేశారు.
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పచ్చ తోరణాలు
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని అశోక చక్రాన్నీ వదలని ‘తమ్ముళ్లు’
రగిలిపోతున్న అభిమానులు...
మాల మహానాడు నేతల నిరసన
చోద్యం చూస్తున్న
కార్పొరేషన్ యంత్రాంగం

టీడీపీ..మహా కవ్వింపు !

టీడీపీ..మహా కవ్వింపు !