
విహార కేంద్రాలకు ప్రత్యేక సర్వీసులు
కడప కోటిరెడ్డిసర్కిల్: వేసవి సెలవులను దృష్టిలో పెట్టుకుని పలు విహార కేంద్రాలతోపాటు పలు పుణ్యక్షేత్రాలకు ప్రత్యేక సర్వీసులను నడపనున్నామని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. మంగళవారం కడప నగరంలోని ఆర్ఎం కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పుణ్యక్షేత్రాలైన వేళాంగిణి, షిర్డి, విహార ప్రాంతాలైన ఊటి, గోవాతదితర ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు తెలిపారు. ఆయా బస్సుల ఏర్పాట్లపై ఆయా డిపో మేనేజర్లకు తగిన ఆదేశాలు జారీ చేశామని వివరించారు.
● జమ్మలమడుగు నుంచి ప్రతి సోమవారం పొలతలకు బస్సును నడుపుతున్నామన్నారు. అలాగే బ్రహ్మంగారిమఠంలోజరుగుతున్న ఆరాధన ఉత్సవాలకుగాను వివిధ డిపోల నుంచి ప్రత్యేక సర్వీసులను నడుపుతున్నామని వెల్లడించారు. మైదుకూరు నుంచి మఠానికి 54 బస్సులు, బద్వేలు నుంచి 22, మఠం నుంచి కాశినాయన క్షేత్రానికి 2 బస్సులను నడుపుతున్నామని వివరించారు.
11న అరుణాచలానికి ప్రత్యేక సర్వీసులు
ప్రముఖ పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో గిరి ప్రదక్షిణ కోసం వెళ్లే వారి కోసం మే 11న ప్రత్యేక సర్వీసులు నడపనున్నటు గోపాల్రెడ్డి తెలిపారు.
● కడప డిపో నుంచి ఉదయం 6 గంటలకు గోల్డెన్ టెంపుల్ మీదుగా, రాత్రి 9 గంటలకు రాయచోటి, చిత్తూరు, వేలూరు మీదుగా బస్సులు బయలుదేరుతుందన్నారు. బద్వేలు డిపో నుంచి ఉదయం 9 గంటలకు అల్ట్రా డీలక్స్ బస్సు బయలుదేరుతుంది. మైదుకూరు డిపో నుంచి మధ్యాహ్నం 3 గంటలకు , ప్రొద్దుటూరు డిపో నుంచి సాయంత్రం 6 గంటలకు సూపర్లగ్జరీ సర్వీసు నడుస్తుంది. పులివెందుల డిపో నుంచి ఉదయం 7 గంటలకు సూపర్ లగ్జరీ సర్వీసు ఉందన్నారు. జమ్మలమడుగు డిపో నుంచి రెండు సర్వీసులు ఉన్నాయని.. ఒక బస్సు సాయంత్రం 6.00 గంటలకు మరో బస్సు రాత్రి 8 గంటలకు నడుస్తాయని వివరంచారు. ఇందులో ఛార్జీలు రూ. 1200 –1300ల మధ్య నిర్ణయించారని తెలిపారు.
జిల్లా ప్రజా రవాణాధికారి గోపాల్రెడ్డి