
నీట్ పరీక్షకు సర్వం సిద్ధం
కడప సెవెన్రోడ్స్: నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్–2025) నిర్వహణకు అధికా రులు ఏర్పాట్లు పక్కాగా చేయాలని.. తొలిసారిగా జిల్లాలో నీట్ పరీక్ష జరగనుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. ఈ నెల 4న నీట్ పరీక్ష నేపథ్యంలో శనివారం సంబంధిత ఏర్పాట్లపై అధికారులతో టెలికాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష చేసి సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్టీఏ మార్గదర్శకాలను, నియమ నిబంధనలను పక్కాగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. కట్టుదిట్టమైన బందోబస్తు నడుమ పరీక్ష నిర్వహించాలన్నారు.పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి విద్యుత్ అంతరాయం లేకుండా చూసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులకు మౌలిక వసతులైన టాయిలెట్స్, తాగునీరు ఉండేలా చూసుకోవాలన్నారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఏఎన్ఎం, మందులు, 108 వాహనాన్ని అందుబాటులో ఉంచాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. దివ్యాంగ విద్యార్థులకు పరీక్ష కేంద్రంలో వీల్ చైర్లను, సహాయకులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి పరీక్ష కేంద్రానికి డిప్యూటీ కలెక్టర్ను ఇన్చార్జిగా నియమించామని తెలిపారు. ఈ పరీక్ష నిర్వహించడానికి నియమించిన అధికారులందరూ వారికి అప్పగించిన విధులను తూచా తప్పకుండా నిర్వర్తించాలని ఆదేశించారు.
8 సెంటర్లు...2428 మంది విద్యార్థులు
జిల్లాలో మొత్తం ఎనిమిది ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇందులో ప్రొద్దుటూరులో రెండు పరీక్ష కేంద్రాలు, కడప జిల్లా కేంద్రంలో ఆరు పరీక్ష కేంద్రాలు ఉన్నాయి. ఈ పరీక్షల్లో మొత్తం 2428 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు హాజరుకావాలని సూచించారు.
కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
నీట్ పరీక్ష 2025 సందర్భంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. విద్యార్ధులకు ఎటువంటి సమాచారం కావాలన్నా ఈ 08562246344 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవచ్చునని కలెక్టర్ తెలిపారు.
పరీక్ష కేంద్రాల వివరాలు
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మార్గదర్శకాలను పక్కాగా పాటించాలి
ఏర్పాట్లపై టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష చేసిన కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి
కలెక్టరేట్లో 08562–246344 నెంబర్ తో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
సమయం.. నిబంధనలు
మే 4 తేదీ ఆదివారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1.30లోగా కేంద్రంలోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు పరీక్ష జరుగుతుంది. రెండు దశల్లో తనిఖీలు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదు. గాజులు, చెవి దిద్దులు, ఆభరణాలు, వాచ్, హ్యాండ్ బ్యాగ్, బెల్టు, టోపీ,రుమాలు, పెన్నులు, పెన్సిళ్లు వంటివి తీసుకురాకూడదు. పెన్నులు పరీక్ష కేంద్రంలోనే అందజేస్తారు. కాగా, ప్రొద్దుటూరు, కడప పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు సమయానికి చేరుకోవడానికి వీలుగా జిల్లా యంత్రాంగం ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేసింది.
ప్రొద్దుటూరు పరిధిలో రెండు పరీక్ష కేంద్రాలు
1.అనిబిసెంట్ మున్సిపల్ హై స్కూల్, (మెయిన్), టి.బి రోడ్ ప్రొద్దుటూరు
2.వైయస్సార్ ఇంజనీరింగ్ కాలేజ్ ఆఫ్ యోగి వేమన యూనివర్సిటీ, కొర్రపాడు రోడ్డు, ప్రొద్దుటూరు
కడప నగర పరిధిలో ఆరు పరీక్ష కేంద్రాలు
1.ఎస్ కే ఆర్ అండ్ ఎస్ కే ఆర్ డిగ్రీ కాలేజ్ ఫర్ ఉమెన్, నాగరాజు పేట, కడప
2. ప్రభుత్వ జూనియర్ కళాశాల, (గర్ల్స్) హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా కడప
3. మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ (మెయిన్), అన్నమయ్య సర్కిల్ దగ్గర కడప
4. పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ, కడప
5. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకులం,చిన్న చౌక్, కడప
6. వై ఆర్ జెడ్పిహెచ్ స్కూల్ (గర్ల్స్), జడ్పీహెచ్ఎస్ కాలనీ, చిన్నచౌక్,కడప