
కొడుకు దూరమై.. బతుకు భారమై
కురబలకోట/బి.కొత్తకోట : ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలిహిల్స్లోని గంగోత్రి చెరువులో ఈతకు వెళ్లి మృతి చెందిన బి. కొత్తకోటకు చెందిన బాలకృష్ణ (29) మృతదేహాన్ని బుధవారం ఉదయం అగ్నిమాపక సిబ్బంది బోటు సాయంతో వెలికి తీశారు. బాలకృష్ణ బి.కొత్తకోట కాలనీలో టైలర్గా ఉన్నారు. ఇతని సంపాదనతోనే రోజులు గడిచేవి. ఇతను ఒక్కడే కుటుంబానికి ప్రధాన జీవనాధారం. ఇతను అవివాహితుడు. పెళ్లి సంబంధాలు చూస్తున్న తరుణంలో ఈతకు వెళ్లి ఆకస్మికంగా మృతి చెందడం కలచివేస్తోంది. ఇతనికి ఈత వచ్చినప్పటికీ చెరువు చివరి వరకు వెళతానని వెళ్లాడు. మధ్యలోకి వెళ్లాక ఈదలేక మునిగిపోయి చనిపోయినట్లు పోలీసులు చెబుతున్నారు. ఇతని తండ్రి శ్రీనివాసులు ఆరేళ్ల క్రితం హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. అక్క పద్మజకు వివాహమైంది. తల్లి మంజుల (50) నిస్సహాయురాలు. అన్న శివ కృష్ణ (35) మానసిక వికలాంగుడు. తల్లిని, అన్నను ఇతనే చూసుకునే వాడు. ఇప్పుడు అతను తిరిగిరాని లోకానికి వెళ్లిపోవడంతో వారి బతుకు ప్రశ్నార్థకంగా మారింది. తల్లి మంజుల పరిస్థితిని తలచుకుని బంధుమిత్రులు వేదన పడుతున్నారు. ఆధారంగా ఉన్న కొడుకు దూరం కావడంతో ఆ తల్లి తల్లడిల్లుతోంది.