
రైతులను ఆదుకోని ప్రభుత్వం
ఖాజీపేట : కూటమి ప్రభుత్వం మోసపూరిత ప్రభుత్వం.. రైతులను మోసగించిన దగా ప్రభుత్వం అని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ప్రభుత్వ తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. ఖాజీపేట మండలం బి.కొత్తపల్లె పంచాయతీ బక్కాయపల్లె గ్రామంలో యువ రైతు పత్తి రామచంద్రారెడ్డి పొలంలో ఆత్మహత్య చేసుకున్న విషయం తెలుసుకుని గ్రామానికి చేరుకున్నారు. మృతి చెందిన రైతుకు నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. మృతికి గల కారణాలను ఆడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చనిపోయిన రైతు మంచి రైతుగా గ్రామంలో పేరు ఉందన్నారు. తాను పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక పోవడంతో ఏటా సాగుకు అప్పులు తీసుకు వచ్చి సాగు చేసేవాడన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం లేక పోవడంతోనే రైతులు ఆత్మహత్యలకు పాల్పడాల్సి వస్తోందన్నారు. చంద్రబాబు వ్యవసాయం దండగ అన్నారని ఆయన అన్నట్లుగానే కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని ధ్వజమెత్తారు. రైతులకు అందాల్సిన రైతు భరోసా ఎక్కడని ప్రశ్నంచారు. తమ ప్రభుత్వంలో రైతులు ఒక్క రూపాయి కూడా ఇన్సూరెన్స్ చెల్లించేవారు కాదన్నారు. ప్రభుత్వమే రైతుల తరపున ఇచ్చేదని తెలిపారు. ఒక్క ఖాజీపేట మండలానికే పంట నష్ట పరిహారం రూ.27 కోట్లు మాజీ సీఎం జగన్మోహన్రెడ్డి ఇచ్చారని గుర్తు చేశారు. ఇన్పుట్ సబ్సిడీతో పాటు రైతుల పంటకు గిట్టుబాటు ధర లేకపోతే గిట్టు బాటు ధర కల్పించి కొనుగోలు చేశామన్నారు. నేడు కూటమి ప్రభుత్వం రైతుల నుంచి ఒక్క గింజైనా కొనుగోలు చేసిందా అని ప్రశ్నంచారు. రైతు అత్మహత్యలతోనైనా ప్రభుత్వం కళ్లు తెరవాలని హితవు పలికారు. చనిపోయిన రైతు కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయంతో పాటు వారి కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మాజీ వ్యవసాయ సలహాదారు సంబటూరు ప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి రాఘవరెడ్డి, ఏపీఎస్ ఆర్టీసీ కడప జోనల్ మాజీ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, మైదుకూరు రైతు విభాగం నాయకుడు నాగిరెడ్డి, కేసీ కెనాల్ ప్రాజెక్టు కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు రెడ్యం చంద్రశేఖర్రెడ్డి, స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
అన్నం పెట్టే రైతుకు దిక్కులేకుండా పోయింది
కడప కార్పొరేషన్ : అన్నం పెట్టే రైతుకు కూటమి ప్రభుత్వంలో దిక్కులేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ బక్కాయపల్లె గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న యువ రైతుకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారన్నారు. పెద్ద కుమార్తె పదో తరగతి పరీక్షలు రాస్తుండగా, చిన్న కుమార్తె 7వ తరగతి చదువుతోందన్నారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలన్నారు.
ఈ ప్రభుత్వం రైతులను గాలికొదిలేసింది
కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని గాలికొదిలేసిందని, ఫలితంగా అప్పులు ఎక్కువై వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. రెండు నెలల క్రితం మైలవరంలో మిర్చి రైతు, ఇప్పుడు వరి రైతు ఉసురు తీసుకున్నాడన్నారు.
మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి