
పవిత్ర జలంతో బలిపీఠాన్ని, ధ్వజస్తంభాన్ని శుద్ధి చేస్తున్న ఆలయ డిప్యూటీ ఈఓ
ఒంటిమిట్ట: ఆంధ్రాభద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం టీటీడీ ఆలయ డిప్యూటీ ఈఓ నటేష్ బాబు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఉదయం 5:00 నుంచి 5:30 వరకు సుప్రభాతం, 5:30 నుంచి 6 వరకు ఆలయ శుద్ధి, ఆరాధన, 6 నుంచి 7 గంటల వరకు సర్వదర్శనం, 7 నుంచి 7:30 గంటల వరకు ఆలయాన్ని నీటితో శుద్ధి చేశారు. అనంతరం ఆలయం ఎదురుగా వెలసిన సంజీవరాయుడు స్వామి ఆలయాన్ని కూడా ఆ పవిత్ర జలాలతో శుద్ధి చేశారు.
● ఈ సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరుకు స్వామి వారి దర్శనం నిలిపివేశారు. తిరిగి 11 గంటల తరువాత నుంచి యధావిధిగా భక్తులు స్వామి దర్శనం చేసుకున్నారు. ఆలయ ఇన్స్పెక్టర్ ధనుంజయుడు, టీటీడీ సిబ్బంది ప్రవీణ్, రాజేంద్రనాయక్, అర్చకులు వీణారాఘవాచార్యులు, నరసింహాచార్యులు, శ్రావణ్ కుమార్, పవన్ కుమార్, మనోజ్ కుమార్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.