కట్టంగూర్ : సమభావన సంఘాలకు చెందిన లెక్కలను చెప్పకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆగ్రహించిన మహిళా సంఘాలు సభ్యులు విచారణకు వచ్చిన అధికారులతో పాటు సర్పంచ్ను గ్రామ పంచాయతీ కార్యాలయంలో బంధించి తాళం వేశారు. ఈ సంఘటన కట్టంగూర్ మండలం చెర్వుఅన్నారం గ్రామంలో సోమవారం జరిగింది. వివరాలు.. చెర్వుఅన్నారం గ్రామానికి చెందిన వీబీకే నాగమణి మహిళా సంఘాలకు సంబంధించిన లెక్కలు చెప్పకపోవటంతో అనేకసార్లు ఉన్నతాధికారులకు మహిళా సంఘాలు సభ్యులు ఫిర్యాదు చేశారు. ఇదే విషయమై అధికారులు విచారణ కోసం అనేకసార్లు గ్రామానికి వెళ్లి లెక్కలు తేల్చకుండా వాయిదాలు వేస్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప సమస్యను పరిష్కరించటం లేదు. ఇందులో భాగంగా సోమవారం ఏపీఎం డి. రాములు, సీసీ ప్రసాద్తో కలిసి చెర్వుఅన్నారం గ్రామ పంచాయతీకి విచారణ నిమిత్తం వెళ్లారు. గ్రామానికి వచ్చిన అధికారులు లెక్కలు చెప్పకుండా మరోసారి వాయిదా వేసినట్లు చెప్పడంతో ఆగ్రహించిన మహిళా సంఘాలు గ్రామ పంచాయతీకి తాళం వేసి మూడు గంటల పాటు అధికారులతో పాటు సర్పంచ్ చిలుముల సైదులును నిర్బంధించారు. మహిళలు ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదు పత్రాలతో గ్రామ పంచాయతీ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సంఘ బంధం–2 అధ్యక్షురాలు గద్దపాటి రేణుక మాట్లాడుతూ.. తాను అధ్యక్షురాలిగా ఎన్నికై సంవత్సరం గడుస్తున్నా వీబీకే నాగమణి సంఘం లెక్కలు చూపించకుండా దాటవేస్తుందని, ఐకేపీ ధాన్యం కొనుగోలు నిర్వహణలో, సంఘం డిపాజిట్లలో అవకతవకలకు పాల్పడిందని ఆరోపించారు. రాత్రయినా అధికారులను బయటకు పంపించకపోవటంతో సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వెళ్లారు. ఉన్నతాధికారులతో మాట్లాడి సమభావన సంఘాల లెక్కలను క్లియర్ చేయిస్తామని హామీ ఇవ్వటంతో పంచాయతీ కార్యాలయం తాళం తీసి అధికారులను బయటకు పంపారు.
మహిళా సంఘాల సభ్యుల ఆగ్రహం
గ్రామ పంచాయతీ కార్యాలయంలో అధికారులను బంధించిన సభ్యులు
చెర్వుఅన్నారంలో ఘటన


